జెడ్పీలో కౌన్సెలింగ్ ప్రశాంతం | ZP counseling calm | Sakshi
Sakshi News home page

జెడ్పీలో కౌన్సెలింగ్ ప్రశాంతం

Nov 16 2014 2:37 AM | Updated on Sep 2 2017 4:31 PM

జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా జరిగింది. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలోని...

కడప ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా జరిగింది. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలోని జెడ్పీ చైర్మన్ చాంబర్‌లో చైర్మన్ గూడూరు రవి, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, సీఈఓ మాల్యాద్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు.

వీరితో పాటు రికార్డు అసిస్టెంట్లు, వాచ్‌మెన్, డ్రైవర్లనూ వారు కోరుకున్న చోటికి బదిలీ చేశారు.  ఎంపీడీఓలకూ స్థాన చలనం కలిగించారు. ఈ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ఉద్యోగులతో జెడ్పీ కార్యాలయ ఆవరణం సందడిగా మారింది.  

 వీడిన పీఠముడి:
 ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ తన చాంబర్‌లో ఉంటుందం టూ జెడ్పీ సీఈఓ మాల్రాది ఇటీవల ప్రకటించారు. ఇది చర్చనీయాంశమైంది. గతంలో బదిలీల ప్రక్రియను చైర్మన్ చాంబర్‌లోనే నిర్వహించారు. అందుకు విరుద్ధంగా ఈసారి కౌన్సెలింగ్ తన చాంబర్‌లో ఉంటుందంటూ సీఈఓ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఒక దశలో చైర్మన్, సీఈఓ ఇద్దరూ పంతానికి పోయినట్లు తెలిసింది.

దీంతో బదిలీలు జరుగుతాయో లేదోనని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు చైర్మన్ చాంబర్‌లోనూ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. బదిలీ అయిన వారికి రెండు మూడురోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సీఈఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement