
సాక్షి, విజయవాడ: ఈ నెల 8న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె, రాష్ట్ర బంద్కు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ మద్దతు ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కనీస వేతనాలపై కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. 8న విజయవాడ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరుకు వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల నుండి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సమ్మెలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ సభ్యులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎం నేత ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే..ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెకు వామపక్షాలు మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు.