ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ - ఎంపీ విజయసాయిరెడ్డి | Sakshi
Sakshi News home page

ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ - ఎంపీ విజయసాయిరెడ్డి

Published Sun, Aug 4 2019 12:49 PM

YSRCP National Secretary And MP Vijayasai Reddy Said That YSRCP Will Always Protect The Interests Of Muslims - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముస్లింల ప్రయోజనాలను కాపాడుతుందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. జిల్లా పరిషత్‌ సమీపంలోని అంకోసాలో వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా వైఎస్సార్‌సీపీని బలపరిచి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. పార్టీ తరఫున ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీని ముస్లింలకు కేటాయిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారరని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ట్రిపుల్‌ తలాక్‌ను వ్యతిరేకించాం
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు మన వైఖరి ఏంటని సార్‌ అని అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించగా ముస్లిం ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారని వెల్లడించారు. ముస్లింలంతా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నారని.. మనం కూడా  వారి ప్రయోజనాలను కాపాడాలంటే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించి ముస్లింలపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం తెలపాలని కొన్ని రాజకీయపార్టీల ఒత్తిడి ఉన్నప్పటికీ  వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడేది  వైఎస్సార్‌సీపీ మాత్రమే అని చెప్పారు.  విశాఖవాసిగా మీ అందరితో కలసి మెలసి ఉండాలనే ఆకాంక్ష ఉందని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి ముస్లింల కోసం చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగాయన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కృషిచేసిన ఏకైక ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. 

మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ టీడీపీ నేతలు ముస్లింలను  వేధింపులకు గురిచేసినా వైఎస్సార్‌సీపీ వెంటే నడిచారని కొనియాడారు. ఇదే తరహాలో రాబోయే జీవిఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని  కోరారు. 
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఎంపీగా తాను గెలవడానికి ముస్లింలే కారణమన్నారు. రైల్వే డివిజన్‌ కోసం పోరాడాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలందరికీ చెప్పి ప్రోత్సహించి, విశాఖ జోన్‌లో వాల్తేరు డివిజన్‌ ఉండాలని పార్లమెంట్‌లో పోరాడుతున్నది విజయసాయిరెడ్డి అని అన్నారు.  వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీ  కృష్ణ మాట్లాడుతూ వచ్చే జీవీంఎసీ ఎన్నికల్లో అన్ని వార్డులు గెలిపించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతినిద్దామ న్నారు. 
వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన శైలిలో ప్రజాపాలన సాగిస్తున్నారని కొనియాడారు. 
వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫరుఖీ మాట్లాడుతూ ముస్లింలో పేదవారు ఉన్నారని వారిని ఆదుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే ఇళ్లు మంజూరు చేయబోమని బెదిరించినా వైఎస్సార్‌సీపీనే గెలిపించామన్నారు. 
కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూరావు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్త కె.కె రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, పార్లమెంట్, నగర మైనారిటీ సెల్‌ అధ్యక్షులు బర్కత్‌ అలీ, షరీఫ్, మైనారిటీ విభాగం ముఖ్య నాయకులు షబీరా, షేక్‌ బాబ్జి, అప్రూజ్‌ లతీఫ్, కేవీ బాబా, షేక్‌ మున్ని, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సత్తి రామకృష్ణారెడ్డి, రొంగలి జగన్నాథం, అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, బెహరా భాస్కరరావు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement