‘ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు’ | YSRCP MLA Anam Ramanarayana Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదు’

Dec 17 2019 1:36 PM | Updated on Dec 17 2019 1:45 PM

YSRCP MLA Anam Ramanarayana Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం తగదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. సోమశిల-మర్రిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోలేదన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో 5 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. భూసేకరణ సమస్యను కూడా  టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 90 వేల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. పంపింగ్‌ పనుల్లో నాసిరకమైన పనులు కొన్ని ఉన్నాయన్నారు. భూసేకరణ పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి  కోరారు.

అసంపూర్తిగానే మిగిలిపోయాయి..
దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు.

ఉపాధి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి...
గత టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లలో నాణ్యత లేదని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం నిధులను తెలుగు తమ్ముళ్లకు పెంచిపెట్టారని మండిపడ్డారు. గతంలో టీడీపీ నుంచి పంచాయతీరాజ్‌ మంత్రిగా లోకేష్‌ ఉన్నారని తెలిపారు. ఉపాధి నిధులను దుర్వినియోగంపై విచారణ జరిపించాలని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

టీడీపీ హయాంలో భారీ అవినీతి జరిగింది..
టీడీపీ సభ్యుల రగడతో ప్రశ్నోత్తరాలు సరిగ్గా జరగడం లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. రాజోలు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందన్నారు. రాజోలులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. రాజోలు అభివృద్ధిపై  దృష్టి పెట్టాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement