రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు,
వైఎస్ఆర్సీపీ దీక్షలకు వెల్లువలా మద్దతు
Oct 3 2013 3:03 AM | Updated on Jul 25 2018 4:07 PM
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు బుధవారం దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు వివిధ సంఘాల జేఏసీ నాయకులు, మహిళా సంఘాలు, మైనార్టీ ఉద్యోగులు, సమైక్య వాదుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. దీక్ష కొనసాగుతున్న ప్రతి చోటా సమైక్య వాదులు వైఎస్సార్సీపీ నాయకులకు మద్దతు ప్రకటించారు. అనంతపురంలో సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి చేపట్టిన 36 గంటల దీక్షకు మైనార్టీ ఉద్యోగులు,
వైద్య ఆరోగ్య జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, లయన్స్క్లబ్ సభ్యులు, మహిళా సంఘాలు హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గుంతకల్లులో పార్టీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి చేపట్టిన దీక్షకు బుడగజంగాలు సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో తిప్పేస్వామి దీక్షకు ఉద్యోగ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఓడీచెరువులో 36గంటల దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ హరిక్రిష్ణకు ఉపాధ్యాయ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఉరవకొండలో 36 గంటల దీక్ష చేపట్టిన పార్టీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డికి అపూర్వ మద్దతు లభించింది. మండల ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Advertisement
Advertisement