అగ్రిగోల్డ్‌ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి | ysrcp demanding cbi enquiry on agrigold scam | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి

Mar 28 2017 6:54 PM | Updated on Aug 9 2018 8:35 PM

అగ్రిగోల్డ్‌ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి - Sakshi

అగ్రిగోల్డ్‌ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి

అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.

న్యూఢిల్లీః  అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అగ్రిగోల్డ్‌ సంస్థ లక్షలాది మంది నుంచి రూ. 7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించిందని, ప్రజలు జీవితకాలమంతా కష్టించి దాచుకున్న డబ్బులను ఈ సంస్థలో డిపాజిట్‌ చేశారని వివరించారు. దాదాపు రూ. 7 వేల కోట్ల మేర ఈ సంస్థ దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు.

2015 ఫిబ్రవరిలో ఈ వ్యవహారం ఒక కుంభకోణమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, హైకోర్టు సైతం ఈ కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను అమ్మలేదని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం అందలేదని, ఈ విషయంలో ఎందుకింత జాప్యం జరుగుతోందని తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. సంబంధిత ఆస్తులను రాజకీయ నేతలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే సంస్థ ఆస్తుల అమ్మకాల్లో జాప్యం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాధితుల్లో దాదాపు 100కు పైగా డిపాజిటుదారులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించిందని వివరించారు. అవినీతి రహిత భారతదేశాన్ని కాంక్షిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement