ప్రభుత్వ వైద్య కళాశాల కావాల్సిందే...
సాలూరు: విజయనగరం జిల్లాలో ప్రైవేటు వైద్య కళాశాలను ఎవరూ కోరుకోవడం లేదని, ఇప్పటికే ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉన్నందున ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సోమవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పీవీజీ రాజుపై అధికార పార్టీ నాయకులకు నిజంగా గౌరవం ఉంటే ఆయన చిర కాల వాంఛ అయిన గిరిజన వర్సిటీని జిల్లాలో సకాలంలో నెలకొల్పాలని సూచించారు. ప్రైవేటు వైద్య కళాశాల ఎవరూ కోరని విషయాన్ని గు ర్తుంచుకోవాలని అన్నారు. పాచిపెంట మండలంలో గిరి జన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 3వేల ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చేందుకు పీవీజీ రాజు కుటుంబీకులు సిద్ధపడ్డారని, కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు సైతం భూములను పరిశీలించారన్నారు. దీనిపై ఎందుకు మాట్లాడరని ఆయన నిలదీసినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు.ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అందుకే జిల్లాకు ప్రైవేటు వైద్యకళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడం సరైన చర్య కాదని అన్నారు.