మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం! | Sakshi
Sakshi News home page

మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం!

Published Fri, May 24 2019 4:24 PM

YSR Congress Party Flag Replaced Araku Parliament - Sakshi

సాక్షి, విశాఖసిటీ: అనుభవం పనిచేయలేదు.. రాజ కుటుంబమనే గౌరవమూ దక్కలేదు. మూడు దశాబ్దాలుగా అధికారాన్ని కట్టబెడితే.. చేసిన మంచి ఏమీ లేదని గ్రహించిన గిరిపుత్రులు రాజుని ఇంటికి సాగనంపారు. మట్టి మనిషి చేతిలో ఘోర పరాభవాన్ని పరిచయం చేశారు. స్వచ్ఛమైన గిరి పుత్రికకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కల్మషం లేని మనుషులంతా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని జగనన్నకు కానుకగా అందించారు. తండ్రీ కూతుళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అరకు పార్లమెంట్‌ స్థానంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రెపరెపలాడింది.

పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసిన గొడ్డేటి మాధవి తెగువ.. తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా.. బినామీ కొండను ఢీకొట్టి.. అమాయక గిరిజనుల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి.. 30 ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. మొదటి రౌండ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌కు అవకాశం ఇవ్వకుండా.. మాధవి ముందంజలో దూసుకుపోయారు.

మొత్తంగా.. మాధవికి 5,51,560 ఓట్లు పోలవ్వగా.. కిశోర్‌చంద్రదేవ్‌కు 3,34,214 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన వైరిచర్ల కుమార్తె శృతిదేవి 17,479 ఓట్లకే పరిమితమై డిపాజిట్లు కోల్పోయారు. ఈమె కంటే నోటాకు (47,376) రెండున్నర రెట్లు అధికంగా ఓట్లు పోలవ్వడం గమనార్హం. తొలి రౌండ్‌లో మొదలైన వైఎస్సార్‌సీపీ ఆధిక్యం.. ఎక్కడా తగ్గకుండా.. దూసుకుపోయింది. మొత్తంగా.. 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
 

ఓటుతో గుణపాఠం చెప్పిన గిరిజనం
సుదీర్ఘ రాజకీయ అనుభవం.. రాజరిక వారసత్వం.. 30 సంవత్సరాలు పార్లమెంట్‌లో గడిపారన్న ఘన చరిత్ర.. ఇవన్నీ చెప్పుకోడానికే తప్ప.. ఓటు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం కృషి చేయలేదన్న అపవాదుని కిశోర్‌ చంద్రదేవ్‌ మూటకట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. నియోజకవర్గాన్ని పట్టించుకున్న సందర్భం లేదు. ఈ వ్యతిరేకతే.. అనుభవానికి గుణపాఠం చెప్పింది.

అసలేం చేశారని ఓటెయ్యాలంటూ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కిశోర్‌చంద్రదేవ్‌ కుమార్తె శృతి దేవిని సైతం సాగనంపారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ఘోర పరాజయం చవిచూశారు. తండ్రీ కుమార్తెలను గిరి పుత్రులు ఓటుతో గుణపాఠం చెప్పారు. 

Advertisement
Advertisement