మళ్లీరావా.. రాజన్నా | YS Rajasekhara Reddy Jayanti special story | Sakshi
Sakshi News home page

మళ్లీరావా.. రాజన్నా

Jul 8 2018 11:37 AM | Updated on Jul 8 2018 11:39 AM

YS Rajasekhara Reddy Jayanti special story - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: రాజకీయ రాజధాని గుంటూరు జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముద్ర సుస్పష్టం. జిల్లాకు రాజన్న రాజకీయ ఉన్నతి కల్పించారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీకి అడ్రస్సే గల్లంతయ్యేలా చేశారు. 2004లో దివంగత వైఎస్సార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో విజదుందుభి మోగించింది. కర్త, కర్మ, క్రియ అన్ని తానై వ్యవహరించి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందేలా చేయడంతోపాటు, తదనంతరం క్యాబినెట్‌ కూర్పులోనూ నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. ఆయన మరణానంతరం రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. అప్పటి వరకు వెన్నంటే నిలిచి అనేక పదవులు పొందిన నేతలు విశ్వాస హీనులుగా మారితే.. ప్రజలు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. మహానేత బాటలోనే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తూ జిల్లా ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. 

  కృష్ణా డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం 
120 ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలో ఏ ప్రభుత్వం ఆధునికీకరణ పనులు చేసే ఆలోచన కూడా చేయలేదు. కేవలం నిర్వహణ, మరమ్మతులకే పరిమితమయ్యాయి. కృష్ణానదికి వచ్చిన వరద ముంపునకు జిల్లా అతులాకుతలం కావడంతో చలించిపోయిన వైఎస్‌ 2008 జూన్‌ 6న సర్‌ ఆర్దర్‌ కాటన్‌ విగ్రహం వద్ద రూ.4,573 కోట్ల వ్యయంతో డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఇందులో 40 శాతం పనులు ఆయన హయంలోనే పూర్తయ్యాయి. ఆ తరువాత ఇప్పటి వరకు మూడు ప్రభుత్వాలు మారినా కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు మరో 10 శాతం కంటే ఎక్కువగా జరగలేదు.

జిల్లాకు అగ్ర తాంబూలం
ఐదేళ్ల పదవీ కాలంలో దివంగత మహానేత జిల్లాకు 57 పర్యాయాలు వచ్చారు. రాజీవ్‌ పల్లెబాట, ఇందిర ప్రభ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ఏడాదికి సగటున పది సార్లు మహా నేత జిల్లాలో పర్యటించారు. జలయజ్ఞం, నాగార్జున సాగర్‌ కుడికాలువ అధునికీకరణ పనులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ ఇలా అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరుపేదలకు అసరాగా నిలిచాయి. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందిన వారు.. ఆయన తనయుడి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ఇందిర ప్రభ ద్వారా గిరిపుత్రులకు జిల్లాలో 6  వేల ఎకరాల భూమికి, భూ హక్కు పత్రాలు మంజూరు చేశారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ పథకాల ద్వారా భరోసా కల్పించారు. 

 పులిచింతల’.. ఆయన పుణ్యమే 
కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల స్థిరీకరణకు పులిచింతల ప్రాజెక్టు ఎంతో అవసరం. దీని కోసం అర్ద శతాబ్దంపైగా కృష్ణా డెల్టా రైతులు ఎదురు చూశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 45.77 టీఎంసీల నీరు నిల్వ ఉండే విధంగా పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణాలో సొంత పార్టీ  ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా ఏ మాత్రం లెక్క చేయకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తి ఆయన హయాంలోనే జరిగాయి. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే ప్రయత్నాలు చేయడం లేదు. 

వైఎస్‌ లేక.. అభివృద్ధి కానరాక
పల్నాడు రైతాంగానికి అనువుగా ఉండేందుకు దుర్గిలో మిర్చి మార్కెట్‌ యార్డును నిర్మించాలని యోచించి నిధులు మంజూరు చేశారు. అది ఇప్పటికి ప్రారంభానికి నోచుకొలేదు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో మొత్తం 2.26 లక్షల ఇళ్లు మంజూరు కాగా 1.49 లక్షల ఇళ్లు వైఎస్‌ హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలినవి నేటికీ నిర్మాణ దశల్లోనే ఉండగా.. కొత్త ఇళ్లు ఒక్కటీ మంజూరైన దాఖలాలు లేవు. ఎందరివో ప్రాణాలు నిలిపిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం 2008లో గుంటూరులోని సాయిభాస్కర్‌ ఆసుపత్రిలో ప్రారంభించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 2010 చివరి వరకు 14 లక్షలకుపై చిలుకు ఆపరేషన్లు జరగ్గా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేశారు.

కొల్లేరు ప్రజలకు ప్రత్యేక వరం
కైకలూరు: చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా విడుదలైన జీవో నంబరు 120తో నష్టపోయిన కొల్లేటి వాసులకు న్యాయం చేయాలనే దూరదృష్టితో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో రూ.350 కోట్ల ప్రత్యేక పునరావాస ప్యాకేజీని వైఎస్‌ అందించారు. కొల్లేరు సరస్సును + 5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదిస్తూ అసెంబ్లీలో సాహసోపేతంగా తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. అప్పటి వరకు కొల్లేరులో ధ్వంసం చేసిన సొసైటీ చెరువుల్లో సంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేసుకోడానికి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.  సర్కారు కాల్వ కర్రల వంతెన స్థానంలో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణానికి రూ. 12 కోట్ల నిధులను కేటాయించి కొల్లేరు ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.  

సాంకేతిక పునాది
గన్నవరం: ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ కార్యకలాపాలను కోస్తా జిల్లాలకు నడిపించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. కేవలం వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటు ద్వారా అభివృద్ధికి బాటలు వేసి భవిష్యత్‌ మార్గనిర్దేశికుడిగా ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్‌అండ్‌టీ సంయుక్త సౌజన్యంతో నిర్మించిన ఐటీ పార్కు ప్రస్తుతం వందలాది మంది ఐటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. తొలుత ఐటీ పార్కు నిర్మించిన స్థలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2004లో సెంట్రల్‌ జైలు నిర్మాణం చేపట్టింది. జైలు ఏర్పాటు కోసం సుమారు 30 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ, భవన నిర్మాణ పనులు  చేపట్టారు. జైలు ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడంతోపాటు భూముల ధరలు కూడా గణనీయంగా పడిపోతాయని ప్రజాప్రతినిధులు, నాయకులు 2006లో జిల్లా  పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జైలు నిర్మాణ పనులు నిలిపివేసి ఆ స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అదే ఏడాది రూ. 95 కోట్లతో ఐటీ పార్కులోని మొదటి టవర్‌ నిర్మాణ పనులకు పునాది రాళ్లు వేశారు. 2009లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ పార్కులోని మేథ టవర్‌ను వైఎస్‌ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య చేతులమీదుగా ప్రారంభించారు. మొదటి టవర్‌లో 14 ఐటీ కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కావడంతో రెండో టవర్‌ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ప్రస్తుతం 1,500 ఉద్యోగులు పని చేస్తుండగా, ఆగస్టు నుంచి మరో వెయ్యి మంది ఉద్యోగులు రానున్నారు. వైఎస్‌ ముందుచూపు ఫలితంగానే ఈ ప్రాంతం ఐటీ హబ్‌గా గుర్తింపుతోపాటు ఒకప్పుడు లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. 

రాజశేఖరుని చొరవతోనే..
వైఎస్సార్‌ దయ వల్లే ఇక్కడ ఐటీ పార్కు ఏర్పాటైంది. ఎయిర్‌పోర్టులో ఆయనను కలిసిన అప్పటి ఎమ్మెల్యే, నాయకులం జైలు నిర్మాణం వల్ల ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని విన్నవించాం. ఒక నిమిషం కూడా అలోచించకుండా అప్పటి ఐటీ మంత్రికి ఫోన్‌ చేసి జైలు నిర్మాణ స్ధలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను పెరుగుపరిచారు. 
మల్లంపాటి బాబూరావు, కేసరపల్లి.

కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటు
మచిలీపట్నం:  ఆనాటి బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని), ఎంపీ బాడిగ రామకృష్ణ, వైఎస్‌ఆర్‌ వద్దకు వెళ్లి మచిలీపట్నంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో వైఎస్‌ 2008 ఏప్రిల్‌ 23వ తేదీ బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన రోజునే యూనివర్సిటీని ప్రారంభించారు. ఆంధ్రా జాతీయ కళాశాలలో తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ ఈ కళాశాల ఆవరణలోనే కొనసాగుతోంది.  ఇటీవల మూడు ప్రాంతాల్లో 182 ఎకరాలను అధికారులు కేటాయించగా దీనిలో ప్రస్తుతం నూతన భవన నిర్మాణం సాగుతోంది. 

దటీజ్‌ వైఎస్సార్‌.. 
లయోలా కాలేజీలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి చదువుకున్న అనుభవం మరువలేనిది.. చనిపోయే వరకు ప్రాణమిత్రులుగా మెలిగాం. మంత్రిగా ఉన్న సమయంలోనూ సమస్య చెబితే ఇట్టే పరిష్కరించేవారు. నేను వైఎస్సార్‌ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, వారు వేటకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన గురించి ప్రస్తావించాను. ఏం చేద్దాం కృష్ణ అన్నారు. మత్స్యకారులకు ఇల్లు కట్టించి, చేపల వేటకు వెళ్లేందుకు వీలుగా బోట్‌లు, సామగ్రిని అందించాలని కోరాను. వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మత్స్యకారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. గ్రామాల్లో పని చేసే విద్యుత్‌ లైన్‌మెన్‌ల కొరత ఎక్కువగా ఉన్న విషయంపై వైఎస్సార్‌ దృష్టికి తీసుకెళ్లాను. మూడు, నాలుగు గ్రామాలకు ఒక లైన్‌మెన్‌ ఉండటం వల్ల స్తంభాలు ఎక్కే హడావుడిలో కిందపడిపోవడం, విద్యుత్‌ షాక్‌లతో మరణించిన ఘటనలను ఆయనకు వివరించాను. దీంతో చలించిపోయిన వైఎస్‌ 7 వేల లైన్‌మెన్‌ పోస్టులను మంజూరు చేశారు. సిబ్బంది కొరతతో చాలీచాలని జీతాలతో కానిస్టేబుళ్లు పడుతున్న ఇబ్బందులను రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే వివరాలు తెప్పించుకుని 36 వేల కానిస్టేబుల్, ఎస్సైల పోస్టులను మంజూరు చేశారు. దటీజ్‌ వైఎస్సార్‌. ఎన్నేళ్లు గడిచినా రాజశేఖరరెడ్డితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం మరువలేనిది. 
– కాసు వెంకటకృష్ణారెడ్డి, మాజీ మంత్రి

ట్రిపుల్‌ ఐటీలో చదివే భాగ్యం కల్పించారు
ట్రిపుల్‌ ఐటీ అంటే మన రాష్ట్రంలో ఎక్కడా లేవు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్నాళ్లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల ట్రిపుల్‌ ఐటీలు నెలకొల్పారు. ఆయన చలవతోనే నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఉచితంగా చదువుకొని ప్రస్తుతం చెన్నైలో పీహెచ్‌డీ చేస్తున్నాను. నెలకు స్టైఫండ్‌ రూ.30 వేలకుపైగా వస్తుంది. నాలాంటి మధ్య తరగతి విద్యార్థులెందరో జీవితాలకు వైఎస్‌ మార్గదర్శకులు. 
– చావపాటి గౌస్‌ సంధాని, పీహెచ్‌డీ విద్యార్థి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆదుకుంది
ఇంజినీరింగ్‌లో సీటు వచ్చినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకపోతే చదువుకునే వాడిని కాదేమో. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇచ్చిన వరం రీయింబర్స్‌మెంట్‌. ఇంజినీరింగ్‌లో ఫీజు కట్టే పని లేకుండా చదువుకున్నాను. ఆయన దయతో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగిగా చెన్నైలో స్థిరపడ్డాను. ఇలాంటి నేతలు ఉంటే విద్యార్థుల భవిష్యత్‌కు కొండంత భరోసా వస్తుంది. 
– షేక్‌ కాలేషా మస్తాన్‌ షరీఫ్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.

అడిగిన వెంటనే వరమిచ్చారు
2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక మొదటిసారి వినుకొండ వచ్చారు. అప్పుడు కృష్ణారెడ్డి సర్పంచ్‌గా ఉన్నాను. ఎత్తిపోతల పథకాన్ని గుండ్లకమ్మ నదిపై ఏర్పాటు చేస్తే గ్రామానికి సాగు, తాగునీరు అందుతుందని వైఎస్‌కు వినతి పత్రం ఇచ్చాం. వినతి పత్రం చూసిన వెంటనే బహిరంగ సభలోనే ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని మహానేత హామీ ఇచ్చారు. వెంటనే రూ.4.83 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యలోగా మృతి చెందారు. పథకానికి దివంగత నేత పేరు పెట్టారు. ప్రస్తుతం రాజశేఖర ఎత్తిపోతల పథకం ద్వారా 1050 ఎకరాలు సాగులోకి వచ్చాయి. గ్రామంలో వైఎస్‌ భారీ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి ఏటా అన్నదానం చేస్తున్నాం.
– కొత్త కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, ఉప్పలపాడు

డ్వాక్రా చెల్లెమ్మలను ఆదుకున్నారు
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పరిపాలనలో డ్వాక్రా మహిళల రుణాలు చిటికెలో అందించే వారు. బ్యాంక్‌ అధికారులు, యానిమేటర్లు గ్రూపు సభ్యులకు తగిన ప్రాధాన్యమిచ్చే వారు. డ్వాక్రా చెల్లెమ్మలకు అన్నయ్యగా అండగా నిలిచారు. చంద్రబాబు మాత్రం డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇచ్చిన కొద్దీగొప్పా రుణాలు వడ్డీలకే కట్టించుకున్నారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి చెందాలంటే వైఎస్‌. జగనన్నతోనే సాధ్యం.... 
– ఈమని మాధవి, 
సరోజిని డ్వాక్రా గ్రూప్‌ లీడర్, గుళ్ళపల్లి.

వైఎస్‌ దయతోనే బతికున్నా..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే నేను బతికున్నాను. గుంటూరు శ్రీనగర్‌లో ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాకు 2011లో గుండెపోటు వచ్చింది. తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే యాంజియోగ్రామ్‌ చేయాలని, స్టంట్‌ వేయాలని, వైద్య సౌకర్యం తమ వద్ద లేదని చెప్పారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న నాకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే స్థోమత లేదు. అలాంటి తరుణంలో డాక్టర్‌ వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేటు ఆస్పత్రిలో ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. వైఎస్‌ నాకు నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.   
– బాసాటి వీరబ్రహ్మం

పొలం డాక్యుమెంట్లు విడిపించుకున్నా
దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు రుణమాఫీ పూర్తిగా జరిగింది. బ్యాంక్‌లో తీసుకున్న రుణం అంతా మాఫీ అవ్వడంతో పొలాల డాక్యుమెంట్స్‌ తిరిగి తెచ్చుకున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. బ్యాంక్‌లో తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోవడంతో భారంగా మారింది. బ్యాంక్‌ల నుంచి నోటీసులు రావడంతో  రుణాలను దశల వారీగా చెల్లిస్తున్నాం. వైఎస్‌ పాలన స్వర్ణయుగం. 
– నిజాంపట్నం రామకృష్ణ, రైతు  భట్టువారిపాలెం.

మూగ గొంతులో మాటల గలగల
చల్లని చేయి, ఆత్మీయ పలకరింపు ఒక మూగ చిన్నారికి మాటలు తెప్పించాయి. ఐదేళ్ల వయసు వచ్చినప్పటికీ మాట, పలుకులేక ఆవేదన చెందిన చిన్నారి నేడు వైస్‌ తాత.. జగనన్న .. అంటూ ముచ్చటగా మాటలు చెబుతోంది. ఇది దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామానికి చెందిన షేక్‌ నాయబ్‌ సైదావలి, కౌసర్‌ దంపతులకు నలుగురు సంతానం. చిన్న కుమార్తె ఇస్రత్‌ జహ పుట్టిన దగ్గర నుంచి మాట, పలుకు లేదు. నరసరావుపేటకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ సభకు జడివానలో చిన్నారితో కలసి ఆమె తల్లి కౌసర్‌ వెళ్లింది. సభ వేదిక పక్కనే బిడ్డతో ఉన్న కౌసర్‌ను వైఎస్‌ ఆత్మీయంగా పలకరించారు. తండ్రిలా వైఎస్‌ పలకరింపు ఆ తల్లి హృదయాన్ని కదిలించాయి. కళ్ల వెంట కారుతున్న నీటితో తన బిడ్డ లోపాన్ని వైఎస్‌కు వివరించింది. చలించిపోయిన వైఎస్‌ ఆమె కొండంత ధైర్యం చెప్పారు. మరో పది రోజులకే చిన్నారి ఇంటికి పిలుపు వచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాలపై ఆ చిన్నారికి ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్‌ ఇన్‌ప్లాంటేషన్‌  ఆపరేషన్‌ చేయించింది. దీంతో చిన్నారి మాటల గలగలలు ఆ ఇంట నవ్వులు విరబూయిస్తున్నాయి. ప్రస్తుతం పాప యల్లమంద ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. 

నిత్యం ప్రజల వెంటే ఉండాలన్నారు
మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కనిపించిన వెంటనే ‘బీసీ నాయకా.. జంగా’ అని ఆప్యాయంగా పిలుస్తారు. రెండు పర్యాయాలు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేను చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వెన్నంటే ఉండాలని భుజం తట్టి ధైర్యం చెప్పేవారు. దండివాగు ఎత్తిపోతల పథకం 24 గంటల విద్యుత్‌ సరఫరా ఇచ్చేందుకు కోటి రూపాయలతో శ్రీనగర్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. తంగెడ, దాచేపల్లి, నడికుడి, శ్రీనగర్, గామాలపాడు, పొందుగల గ్రామాలకు కృష్ణానది నీటిని అందించారు. పిడుగురాళ్ల, గురజాల, మాచవరం మండలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టించాం. అర్హులైన వారికి పింఛన్లు ఇచ్చాం. నియోజకవర్గంలో జరిగిన వందల కోట్ల అభివృద్ధిలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర ఉంది. బీసీలంటే వైఎస్సార్‌కు అమితమైన ప్రేమ. ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటు.
జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం 
రాష్ట్ర అధ్యక్షుడు  

రైతు బిడ్డ వైఎస్‌
నేను దాచేపల్లి ఎంపీపీగా ఉన్నప్పుడు 2008లో అధికంగా వర్షాలు కురిశాయి. మండలంలోని కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు కొట్టుకుపోయాయి. ఆదుకోవాలని విన్నవించేందుకు అప్పటి మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, పిన్నెల్లి లక్ష్మారెడ్డిలతో కలిసి 30 మంది రైతులం వైఎస్సార్‌ను కలవటం కోసం సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లాం. సమస్య విన్న వైఎస్‌ నెల రోజులు తిరగకుండానే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించారు. మేము కలిసిన రోజు రైతుల కష్టాల గురించి ఆయనే స్వయంగా మాకు చెప్పారు. వైఎస్సార్‌ తండ్రి రాజారెడ్డి పండించిన మిరపకాయలు డాబాపైన ఆరబెడితే వర్షానికి కొట్టుకుపోకుండా తాను కంది కట్టెను అడ్డుపెట్టి ఆపిన సంఘటనను వైఎస్సార్‌ గుర్తు చేశారు.          
అంబటి శేషగిరిరావు, మాజీ ఎంపీపీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement