జన హృదిలో.. ప్రతి మదిలో వైఎస్సార్‌ | YS Rajasekhara Reddy 9th Death Anniversary | Sakshi
Sakshi News home page

జన హృదిలో.. ప్రతి మదిలో వైఎస్సార్‌

Sep 2 2018 8:28 AM | Updated on Sep 2 2018 8:30 AM

YS Rajasekhara Reddy 9th Death Anniversary - Sakshi

అభివృద్ధిపై ఆయనది చెరగని సంతకం. 
పేదల బతుకుల్లో వెలుగుల చిరుదివ్వె.
అనారోగ్య పీడితులకు ఓ భరోసా.
విద్యార్థుల ఉన్నత చదువులకు ఓ నమ్మకం.
ప్రతి మదిలోను, ప్రతి ఎదలోనూ ఒకే నామస్మరణ అదే వైఎస్సార్‌.  


సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రతి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఏదో విధంగా లబ్ధి పొందింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సొంత ఇల్లు ఇలా అన్నిరకాలుగా లబ్ధి పొందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. డెల్టా, మెట్ట, ఏజెన్సీ ఏ ప్రాంతం అయినా ఆయన వల్ల వరాలు పొందని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ మహానేత మరణించి నేటికి తొమ్మిదేళ్లు అయినా ఆయన తమ గుండెల నిండా ఉన్నాడని అయన వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు నేటికీ గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాయి. వైఎస్సార్‌ పశ్చిమ గోదావరి జిల్లాపై వల్లమాలిన ప్రేమ చూపించేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన పశ్చిమ నుంచే ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చారు.  జిల్లాలో పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తాడిపూడి ఎత్తిపోతల, డెల్టా ఆధునికీకరణ, ఏటిగట్ల పటిష్టత ఇలా ఆయన చేపట్టని ప్రాజెక్టు లేదు. 

ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిన పథకాలు
కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని ఒక పేద కుటుంబంలో పుట్టిన సోమరాజు వైఎస్‌ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా త్రిపుల్‌ ఐటీ ద్వారా ఉన్నత చదువులు చదివి టెక్‌మహేంద్రా వంటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇలా ఉన్నత చదువులు అందని ద్రాక్షలా ఉన్న కుటుంబాల నుంచి వేల సంఖ్యలో యువతీయువకులు ఉన్నతస్థానాలకు ఎదగడానికి వైఎస్‌ చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దోహదం చేసింది. అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత విద్యను ఉచితంగా అందించేందుకు సమున్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చింది. వైఎస్‌ మరణానంతరం పేదలకు ఫీజు కష్టాలు మొదలయ్యాయి.

అందరి బంధువయ
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు జబ్బుచేస్తే డబ్బులెలా అనేది వారి ఆలోచన.  గుండె జబ్బు సోకి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉండే గిరిజన కుటుంబాలకు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిగా మారింది. ఇది ఏజెన్సీ ప్రాంతంలో వందల సంఖ్యలో గిరిజనుల ప్రాణాలు కాపాడింది. ఇలా ఏ గుండెను కదిపినా వైఎస్‌ నామస్మరణే. వైఎస్‌ తన హయాంలో ఏ వర్గానికి చెందిన ప్రజలను కూడా విస్మరించకుండా అందరికీ అవసరమయ్యే పథకాలతో వారి గుండెల్లో నిలిచిపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నేడు ఆరోగ్యశ్రీ పేరు మార్చినా సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 పథకం మూలనపడింది.

జలయజ్ఞ ప్రదాత 
జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయన హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరుగులు తీశాయి. నిత్యం పోలవరం కోసం తపించారు. డెల్టాను ఆధునికీకరించడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరగాలని భావించారు. రైతన్నకు భరోసా అందించారు. గుండె గుండెలో గూడు కట్టుకున్నారు. మెట్ట ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. పోలవరం కాల్వలు ఆయన సమయంలోనే పూర్తికాగా, ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులను ఆయనే తీసుకువచ్చారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లలో ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే.  

పోలవరం గ్రామానికి వరద ప్రమాదం లేకుండా రూ.6 కోట్లతో నెక్లెస్‌ బండ్,  పోలవరం నియోజకవర్గంలోని ముంపు జలాలను గోదావరి నదిలోకి మళ్ళించడానికి రూ. 57 కోట్లతో కొవ్వాడ అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్, పాలకొల్లు నియోజకవర్గంలో  యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ. 20 కోట్లతో రివిట్‌మెంట్‌ కోసం వైఎస్‌ తీసుకున్న చొరవ కారణంగా ఆ ప్రాంత ప్రజలు ముంపు బారి నుంచి బయట పడగలిగారు. ఏలూరు ప్రజలకు దుఖఃదాయినిగా ఉన్న తమ్మిలేరు వరదల నుంచి జిల్లా కేంద్ర ప్రజలకు విముక్తి కల్పించారు. 2005లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా వచ్చి పరిశీలించిన వైఎస్‌ ఇక్కడి నుంచి వెళ్లకముందే మొదటి దశ పనులకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. సుమారు రూ.90కోట్ల నిధులు మంజూరు చేసి ఆయా ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్టం చేసి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపించారు. ఇటీవల వచ్చిన భారీ వరదలకు కూడా ఏలూరు తట్టుకుని నిలబడటం కూడా వైఎస్‌ చొరవే. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో ఉచిత విద్యుత్‌ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతులకు రుణ మాఫీ చేసిన రైతు బాంధవుడిగా అందరూ వైఎస్‌ను గుర్తు చేసుకుంటున్నారు.  

పేదల సాధికారిత కోసం 
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో ఎనలేని కృషి చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వైఎస్సార్‌ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. కూలీలుగా ఉన్న వారికి భూములు ఇచ్చి ఆ భూముల్లో మోటార్‌లు వేయించడంతో పాటు వాటికి విద్యుత్‌ కనెక్షన్‌లు ఏర్పాటు చేసి, వాటికి ఉచిత కరెంట్‌ ఇచ్చి కూలీలను రైతులుగా మార్చిన ఘనత వైస్సార్‌దే. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు 30 వేల ఎకరాల భూపంపిణీ చేయడంతో ఆ నిరుపేద రైతులు రాజశేఖరరెడ్డిని నేటికీ దేవుడిగా కొలుచుకుంటున్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు విద్యావకాశాలు కల్పించి తద్వారా ఉద్యోగావకాశాలు పొందేలా వైఎస్‌ తీసుకున్న చొరవ ఇప్పటికీ ఆయన తీపిగురుతుగా నిలిచి ఉంది. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వెలుగు నింపారు. ఇప్పటి ప్రభుత్వం రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను డిఫాల్టర్లుగా మార్చింది. అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు తపన పడ్డారు కాబట్టే  వైఎస్సార్‌ అందరి గుండెల్లొ గూడుకట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement