
అప్పులు తీర్చలేకే ఆత్మహత్య చేసుకున్నారు
డీ.హీరేహాళ్ : ‘పంటల సాగు కోసం అప్పులు చేశాం. వర్షాల్లేక పంటలు పండలేదు. అప్పులు తీర్చేమార్గం లేకే ఆత్మహత్య...
డీ.హీరేహాళ్ : ‘పంటల సాగు కోసం అప్పులు చేశాం. వర్షాల్లేక పంటలు పండలేదు. అప్పులు తీర్చేమార్గం లేకే ఆత్మహత్య చేసుకున్నార’ని మండలంలోని పులకుర్తి గ్రామానికి చెందిన రాముడు తల్లి లింగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రాముడు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్, రాముడు కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ ఇలా...
వైఎస్ జగన్ : భూమి ఎంతుందవ్వా..?
లింగమ్మ : సొంత భూమి రెండెకరాలు ఉంది. పదెకరాలు కౌలుకు చేసేవాళ్లం.
జగన్ : ఎంత అప్పు తీసుకున్నారు?
లింగమ్మ : పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదు. దీంతో బ్యాంకులో అప్పు తీసుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.2 లక్షల వరకు అప్పులు చేశాం.
జగన్ : ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
లింగమ్మ : పంటల సాగు కోసం అప్పులు చేశాం. వర్షాలు లేక, పంటలు పండక తీవ్ర నష్టం వచ్చింది. అప్పులు తీర్చడానికి అవకాశం లేక మనస్తాపం చెందాడు. ఉన్న భూమిని అమ్మి అప్పులు తీరుద్దామని భార్యతో చెప్పగా.. ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ గొడవపడి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పిల్లలను నా పాలిట వేసి వెళ్లిపోయారు నాయనా..(కన్నీటి పర్యంతమవుతూ..)
జగన్ : అవ్వా ఏడ్వొద్దు. నిన్ను చూసి పిల్లలు కూడా ఏడుస్తారు .
లింగమ్మ : పిల్లల ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు.
జగన్ : ఎంత మంది పిల్లలు?
లింగమ్మ : ముగ్గురు సార్
జగన్ : ఏమి పేర్లు?
పిల్లలు : నందిని, శివకుమార్, కీర్తి
జగన్ : డ్వాక్రా రుణాలు ఉన్నాయా?
లింగమ్మ : తీసుకోలేదు .
జగన్ : నీ భర్త ఎప్పుడు మృతిచెందాడు అవ్వా?
లింగమ్మ : కోడలు, కొడుకు మృతిచెందిన వారం రోజులకే నా భర్త కూడా బెంగతో చనిపోయాడు.
జగన్ : నీకు ఎంత మంది కుమారులు?
లింగమ్మ : ముగ్గురు
జగన్ : (లింగమ్మ కుమారుడు
హనుమంతునుద్దేశించి..) నీకు ఎంత
మంది పిల్లలు?
హనుమంతు : నలుగురు కుమార్తెలు
జగన్ : కొడుకు కోసమా ఇంత మంది?
హనుమంతు : అవును సార్..
జగన్ : పిల్లలను చదివించేందుకు రామచంద్రారెడ్డన్న సహాయపడతారు. ఆయన సహకారం తీసుకోండి.
లింగమ్మ : పింఛన్ కూడా ఇవ్వడం లేదు సార్..
జగన్ : రామచంద్రారెడ్డన్న తహశీల్దార్తో మాట్లాడి.. పింఛన్, రేషన్ కార్డు వచ్చేలా సాయపడతారు.
జగన్ : మీవాళ్లు చనిపోయినప్పుడు ఎవరైనా వచ్చి సాయమందించారా?
లింగమ్మ : ఎవరూ రాలేదు సార్.
జగన్ : పిల్లలను బాగా చదివించండి
లింగమ్మ : చదివిస్తాం సార్.