గుండె గుండెన..వేదన | Ys jagan raithu bharosa yatra | Sakshi
Sakshi News home page

గుండె గుండెన..వేదన

May 18 2015 3:17 AM | Updated on Jul 25 2018 4:09 PM

గుండె గుండెన..వేదన - Sakshi

గుండె గుండెన..వేదన

గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో రైతు భరోసా యాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్...

కలత నిద్రలోనూ రైతులకు కలవరింతలే
రుణమాఫీ పత్రాలతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
తీరు మారని సర్కారుపై ధ్వజం
ఎర్రని ఎండలోనూ బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
జగన్ యాత్రకు గ్రామగ్రామాన విశేష స్పందన

 
 ( సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో రైతు భరోసా యాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి  ప్రజలు ప్రతిచోటా సమస్యలను ఏకరువు పెట్టారు. కన్నీళ్లతో ఎదురవుతున్న మహిళలు, బరువైన గుండెలతో బావురుమంటోన్న అన్నదాతల గోడు విని జగన్ చలించిపోయారు.  కలత నిద్రలోకి జారుకుంటున్న తమను అప్పుల కలవరింతలే భయపెడుతున్నాయని అన్నదాతలు వాపోయారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటేసినందుకు 47 మంది వృద్ధులకు పింఛన్లు ఆపేశారంటూ యర్రగుంట గ్రామస్తులు అధికార పార్టీ నిర్వాకాలను ఎండగట్టారు. నెలవారీ ఇచ్చే సబ్సిడీ సాయం మూడు నెలలుగా నిలిచిపోయిందని ఉరవకొండ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన   ఆదర్శ రైతులు, విద్యా వలంటీర్లు, బిల్లులందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఇన్ పుట్ సబ్సిడీ అందని రైతులు.. ఇలా ప్రతిఒక్కరూ వైఎస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన అందరి కన్నీళ్లను తుడుస్తూ ముందుకు సాగారు. కష్టాలు కలకాలం ఉండవని ధైర్యం చెప్పారు. భవిష్యత్తు మనదేనన్న భరోసా నింపారు.  

 ఆదివారం యాత్ర సాగిందిలా...
 ఉదయం 10 గంటలకు  బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ నుంచి ఏడో రోజూ భరోసా యాత్ర ప్రారంభమైంది. దేవగిరి గ్రామం చేరుకుని.. ఆత్మహత్య చేసుకున్న రైతు నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. ‘అధైర్య పడొద్దు...పార్టీ అండగా ఉంటుంద’ని భరోసా ఇచ్చారు. అనంతరం తిమ్మలాపురం చేరుకుని రచ్చబండ దగ్గరున్న వృద్ధులు, రైతులను పలకరించారు. ఈ సందర్భంగా రుక్మిణమ్మ అనే మహిళా రైతు పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించింది. రూ.46 వేల రుణమాఫీ అయినట్లు ప్రభుత్వం పత్రం ఇచ్చినప్పటికీ ఆంధ్రాబ్యాంకు అధికారులు మాత్రం కుదరదంటున్నారని తిమ్మలాపురం రైతు పాటిల్ యువరాజు వాపోయాడు.

ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పత్రాన్ని కూడా జగన్‌కు చూపాడు. తర్వాత జగన్  ఐదు నెలల కిందట కరెంటు షాక్‌తో మృతిచెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామలింగప్ప కొడుకు మారెన్న కుటుంబాన్ని పరామర్శించారు. ట్రాన్స్‌కోపై కేసు ఫైల్ చేసి.. న్యాయం జరిగేలా చూస్తామని మారెన్న భార్య లక్ష్మికి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి పులకుర్తి చేరుకున్నారు. రైతు బోయ రాముడు కుటుంబాన్ని పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటలకు డీ.హీరేహాళ్ చేరుకుని ముస్లిం మహిళల సమస్యలు విన్నారు.

అనంతరం ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న రైతు తలారి ఈరన్న కుటుంబాన్ని పరామర్శించారు. భార్యాపిల్లలకు ధైర్యం చెప్పారు. ఆదివారం నాటి యాత్రలో వైఎస్ జగన్‌తో పాటు అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, కదిరి ఎమ్మెల్మే చాంద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీ, రాయదుర్గం సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల ర ఘురాం, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఉపేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి,  జిల్లా నేతలు షేక్‌షా, బాలప్పయాదవ్, అనంతపురం నగర  మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, బొమ్మనహాళ్ మండల నేతలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, యోగేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లాల్‌సాబ్ తదితరులు పాల్గొన్నారు.
 
 నేటితో ముగియనున్న రెండో విడత భరోసా యాత్ర
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత రైతు భరోసాయాత్ర సోమవారంతో ముగియనుంది. ఉదయం తొమ్మిది గంటలకు రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ నుంచి యాత్ర మొదలవుతుంది. కాదలూరు చేరుకుంటుంది. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అదే గ్రామంలో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement