ఉసురు ఖాయం | YS jagan raithu bharosa yatra | Sakshi
Sakshi News home page

ఉసురు ఖాయం

May 16 2015 3:44 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఉసురు ఖాయం - Sakshi

ఉసురు ఖాయం

ఫ్యాన్‌కు ఓటేసినానని నా పింఛను నిలిపేసిరి. మేం ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురమూ ముసలోళ్లమే.

ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే పింఛన్ ఆపుతారా?
ముసలోళ్ల ఉసురు తగలక తప్పదు
వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు పోతయ్...
త్వరలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
భరోసా యాత్రలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్
ఉరవకొండ నియోజకవర్గంలో కొనసాగిన ఐదో రోజు యాత్ర
సీఎంపై చేనేత కార్మికుల శాపనార్థాలు

 
 (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఫ్యాన్‌కు ఓటేసినానని నా పింఛను నిలిపేసిరి. మేం ముగ్గురం అన్నదమ్ములం. ముగ్గురమూ ముసలోళ్లమే. మూడు నెలలుగా అందరికీ పింఛన్ ఆపేశారు. ఇదేమన్నా నాయంగా ఉందాని అడిగితే కసురుకుంటున్నారు బాబూ’ అంటూ కాళ్లు తడబడుతుంటే,  గద్గత స్వరంతో  పెద్దాయన చెప్పిన మాటలు విన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఏం బాధ పడకు తాతా.. న్యాయం, ధర్మం వదిలేసి నిస్సిగ్గుగా అరాచకాలు చేస్తోన్న టీడీపీ నేతలపై గట్టిగా పోరాడదాం.

అన్ని నియోజకవర్గాల్లో పింఛను రాని వృద్ధులను వెంటబెట్టుకుని కలెక్టరేట్‌ను ముట్టడిద్దాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మేమన్నా పాకిస్తాన్‌లో ఉన్నామా అంటూ కడిగేద్దాం’ అని ధైర్యం చెప్పారు. రైతుభరోసా యాత్రలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఉరవకొండలో స్థానిక శాసనసభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన చేనేత కార్మికుల ముఖాముఖి నిర్వహించారు. ఎర్రగొండ గ్రామానికి చెందిన వృద్ధుడు వన్నూరప్ప వేదిక పెకైక్కి మైకందుకుని తన గోడు వెళ్లబోసుకున్నాడు.

పోయిన ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసినామని టీడీపీ నాయకులు గ్రామంలో మొత్తం 47 మందికి పింఛన్లను ఆపేశారని ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ తనయుడు శివ వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాబుకు ముసలోళ్ల ఉసురు తగులుతుందిలే. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు పోతయ్.నువ్వేం బెంగపడక’ంటూ జగన్ నచ్చజెప్పారు. ఈ సందర్భంగా పలువురు డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, రైతులు సీఎం పీఠం ఎక్కాక చంద్రబాబు విస్మరించిన ఎన్నికల హామీలను లేవనెత్తుతూ ఆయనకు శాపనార్థాలు పెట్టారు. లక్ష్మీదేవమ్మ అనే మహిళ డ్వాక్రా రుణాలు కట్టే ప్రసక్తిలేదనీ, మోసం చేసిన బాబు వాటిని మాఫీ చేయాలని డిమాండు చేశారు.
 
 భగభగ మండే ఎండలోనే....
 శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భానుడు ప్రతాపాన్ని చూపాడు. అయినా వెనుకంజ వేయకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉరవకొండ, పందికుంట, వెంకటంపల్లి గ్రామాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ఉరవకొండలోని రైతు అందెల వన్నయ్య ఇంటికెళ్లి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా చేనేత కార్మికుల కాలనీకి చేరుకున్నారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావదానంగా విన్నారు.

ఈ సందర్భంగా చేనేత సంఘం నేతలు చెంగల మహేశ్, చందా వెంకటస్వామి, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ చేనేతలు పడుతున్న ఇక్కట్లు, ప్రభుత్వం అవలంబిస్తోన్న నిర్లక్ష్య వైఖరిని వివరించారు. చేనేత కార్మికులకు మూడు నెలలుగా నిలిపేసిన రూ.600 సబ్సిడీని పునరుద్ధరించాలని కోరారు. పట్టు, జరీ, నూలు వంటి ముడి సరుకు ధరలు తగ్గేలా చూడాలన్నారు. ముక్కుపుడక కూడా కుదవ పెట్టి అప్పులు తీర్చామని, బాబు మాటలు నమ్మి మోసపోయామని వరలక్ష్మి అనే మహిళ వాపోయింది. చంద్రబాబుకు ఈ మధ్యనే మతిమరుపు వ్యాధి వచ్చిందనీ, ఆ దేవుడు కరుణిస్తేగానీ అది నయం కాదని చమత్కరించిన జగన్.. చేనేత కార్మికుల్లో భరోసా నింపారు.
 
 అన్నా...నీకు రుణపడి ఉంటాం..
 ఉరవకొండ నుంచి పందికుంట బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నేతలు ఆదినారాయణరెడ్డి, మీసాల రంగన్నతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ డి. శ్రీనివాసరెడ్డి, కొండయ్య, వెంకటేశ్వర్లు, సర్వానాయక్‌లు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ‘అన్నా.. నీకు రుణపడి ఉంటాం.మీరు మద్దతు తెలిపి ప్రకటన చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింద’ని అన్నారు. అనంతరం వైఎస్ జగన్ తట్రకల్లు మీదుగా పందికుంట చేరుకున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఓబులేసు కుటుంబాన్ని పరామర్శించారు.

అక్కడి నుంచి వెంకటంపల్లి పెద్దతండా చేరుకుని గోవిందనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత వెంకటంపల్లిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జోరున కురిసే వర్షంలోనూ వెంకటంపల్లి, జయరాంపురం గ్రామస్తులు వైఎస్ జగన్ కోసం ఎదురు చూశారు. ఉరవకొండ నుంచి వెంకటంపల్లి వరకూ అభిమానులు ఎండావానలను లెక్క చేయకుండా వెన్నంటే ఉండటం గమనార్హం. జయరాంపురం, షేక్షానుపల్లి గ్రామాల్లోనూ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి.. స్వాగతం పలికారు. జగన్ వెంట మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు.
 
 నేటి జగన్ రైతు భరోసాయాత్ర సాగేదిలా..
 అనంతపురం ఎడ్యుకేషన్  : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత రైతుభరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంటుంది. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం.. ఉరవకొండ పట్టణం నుంచి బయలుదేరి వివిధ గ్రామాల మీదుగా కణేకల్లుకు చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు గంగవరం శర్మాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ,  ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement