ఈ సంకల్పం.. అందరికోసం

YS Jagan Praja Sankalpa Yatra For People - Sakshi

భరోసా కల్పిస్తున్న నవరత్నాలు

ప్రతిమదిలో జగన్‌ వరాలు సంకల్ప సారధికి జేజేలు

ఎండమావిలో పన్నీటి జల్లులా...కష్టాల కడలిలో చుక్కానిలా ఇపుడుకొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోములో వెలుగునింపుతోంది.జననేత ఇచ్చిన భరోసాతోప్రతిఒక్కరిలో ఆశలు నింపుతోంది.భరోసా కలిగిస్తోంది.

విశాఖపట్నం, చోడవరం : ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఆధునిక వ్యవసాయం మాట దేవుడికెరుకగాని ఉన్న సాధారణ వ్యవసాయమే చేయలేని పరిస్థితిలో వైఎస్సార్‌సీపీలో ప్రవేశపెట్టిన నవరత్న పథకాల్లో ‘రైతు భరోసా’ పథకం రైతులకు కొండంత అండగా నిలుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతి రైతుకు రూ.12500 ఇవ్వడంతోపాటు పంటల బీమా ప్రీమియం కూడా తమ ప్రభుత్వమే చెల్లించేలా చూస్తామని జగన్‌ చెప్పడం రైతుల్లో ఎంతో ఆనందాన్ని నింపింది. ఉచితంగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు, పంట దిగుబడి ముందే కొనుగోలు గిట్టుబాటు ధరను ప్రకటిస్తామని, ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటాకాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.4వేల కోట్లు స్థిరీకరణ నిధిని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని చెప్పడం రైతుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది.  సుగర్‌ ఫ్యాక్టరీలను, చెరకు రైతులను ఆదుకోవడంతోపాటు పాడి రైతులకు లీటరుకు రూ.4 బోనస్‌గా ప్రకటించడం, సహకార పాల డెయిరీలను ప్రతి జిల్లాకు ఏర్పాటు చేస్తామని చెప్పడం పాడి రైతుకు ఊరటనిస్తుంది.

‘అమ్మ ఒడి’..ఆలంబనగా..
 పేద కుటుంబాలకు ఉన్నత భవిష్యత్తును ఇచ్చేదిగా ఉంది. టీడీపీ పాలనలో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం, ప్రైవేటు పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు కట్టలేక దిగాలు పడుతున్న కుటుంబాలను జగన్‌ ప్రకటించిన అమ్మ ఒడి పథకం అక్షరాస్యత శాతాన్ని నూరుశాతం పెంచేదిగా ఉంది. బడికి పంపిస్తే చాలు ఒక్కో పిల్లోడికి ఏటా రూ.15వేలు నేరుగా తల్లికే ఇస్తానని, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివినా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం అన్ని వర్గాల కుటుంబాలకు ఓ వరం కానుంది.

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ ఉన్నతంగా..
గడిచిన ఐదేళ్లలో ఇంజినీరింగ్, డాక్టర్‌తోపాటు ఉన్నత చదువులన్నింటి ఫీజులు రూ.లక్షకు పైగానే పెరిగాయి.  ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుకయ్యే ఎంత ఖర్చయినా రూ.లక్ష వరకు భరించడంతో పాటు హాస్టల్‌ ఖర్చు కింద రూ.20వేలు ఇస్తామని జగన్‌ ఇచ్చిన హామీ ‘ఉన్నత’ విద్యార్థి లోకానికి ఓ మంచి అవకాశంగా ఉంది.

‘డ్వాక్రా రుణమాఫీ’ ఒక ఆసరా  
డ్వాక్రా మహిళలకు వరంగా కానుంది. గత ఎన్నికల్లో మహిళలందరికీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తర్వాత మాఫీ చేయకపోవడంతో మహిళలంతా అప్పుల చేసి మరీ వడ్డీతో సహా అసలు కట్టిన విషయం తెలిసిందే. దీనితో మహిళలంతా ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీ పథకం మహిళలందరికీ వరంగా మారనుంది. 

ఇంపుగా ‘పింఛన్‌ పెంపు’
ఇప్పటి వరకు రూ.వెయ్యి ఇస్తున్న వృద్ధాప్యం పింఛన్‌ను రూ.2వేలకు, వికలాంగుల పింఛన్‌ రూ.1500 నుంచి 3వేలకు పెంచుతామని జగన్‌ చేసిన ప్రకటన వేలాది మంది లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమౌతోంది. 

గృహ నిర్మాణం పక్కా..
 చంద్రబాబు హయాంలో ఊరికి నాలుగైదు కూడా ఇళ్లు మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిలో అర్హులైన వారందరికీ పక్కాగృహాలు మంజూరు చేయడంతోపాటు స్కీం మొత్తాన్ని రూ. లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచి ఇస్తామని చెప్పడం గూడులేని వారికి నమ్మకం ఏర్పడింది. ఆరోగ్య శ్రీ పథకానికి గతంలో కంటే నిధులు పెంచి రూ.వెయ్యికి మించి ఖర్చయ్యే ప్రతి వైద్యానికి ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని జగన్‌ ప్రకటించడం జనారోగ్యానికి ఢోకాలేదనే భావన  ఏర్పడింది. 

ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు
 గ్రామ సచివాలయ వ్యవస్థలో స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి వారికి జీతాలు ఇస్తూ వారి ద్వారా రేషన్‌తోపాటు అన్ని పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపించే కొత్త విధానికి శ్రీకారం చుట్టేందుకు జగన్‌ సంకల్పించడం మేధావుల మన్ననలు సైతం పొందుతుంది.

పంటకు ముందే ధర నిర్ణయం  భేష్‌
అందరూ రైతులకి ఇదిచేస్తాం అది చేస్తాం అని ఓట్లు అడుగుతారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రైతులనే మరిచిపోతారు. రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకున్నారు. అతనిలాగే అతని కుమారుడు చేస్తాడని నమ్మకం ఉంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పించారు. పంట పండించడానికి ముందే పంటకు ధర నిర్ణయించడం అంటే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగైతే రైతులు పంటలు పండించడానికి ముందుకు వస్తారు.– బూడి వెంకటరమణ, రైతు, గౌరీపట్నం

నిరుద్యోగులకు ఉపాధి వస్తుంది
రాష్ట వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలతో పాటు, ఉపాధి అవకాశాలు వస్తాయి. జగనన్న పాదయాత్ర వల్ల ఎంతో మంది నిరుద్యోగుల సమస్యలను దగ్గర నుంచి విన్నారు. జగనన్న తప్పకుండా నిరుద్యోగులకు సముచిత స్ధానం కల్పిస్తారు. కొద్ది రోజుల్లోనే మంచిరోజులు వస్తాయన్న నమ్మకం మా యువతకు కలిగింది.  – కంటే వెంకట్, మంగళాపురం, బుచ్చెయ్యపేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top