శ్రీవారి కీర్తి, పవిత్రతను దెబ్బతీసేలా నిరంతరం అబద్ధాలు
హిందూధర్మాన్ని బలిపెట్టే స్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్టీనేటర్ కన్నబాబు
కాకినాడ రూరల్: ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తప్పుపట్టాలని, ఆయనపై బురద చల్లాలనే తప్పుడు ప్రయత్నాలతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్టినేటర్, మాజీమంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అందులో భాగంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కీర్తికి, పవిత్రతకు అపఖ్యాతి కలిగించాలని నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఆధారాలతో మాట్లాడాలని, భక్తులు, ప్రజల మనోభావాలతో ఆటలాడటం మంచిదికాదని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి సిట్ వేసిందన్నారు.
సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ఈ సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి, చంద్రబాబు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోల వాంగ్మూలాలను రికార్డు చేసి, లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారన్నారు. మొన్నటివరకు జంతుకొవ్వు అన్నారని, ఇప్పుడు ఏకంగా బాత్రూములు కడిగే హారి్పక్, కెమికల్స్ కలిపేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్పై ఉక్రోషంతో చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని, హిందూధర్మాన్ని బలిపెట్టే స్థితికి తీసుకొచ్చారని చెప్పారు.
హెరిటేజ్ ఉత్పత్తుల్లో కల్తీ
హరియాణలో విక్రయిస్తున్న హెరిటేజ్ పెరుగులో నాణ్యతలేదంటూ ఎఫ్ఎస్ఎస్ఏఐ నివేదిక ఇచ్చి, రూ.లక్ష పెనాల్టీ విధించి, సెబీకి నివేదించిందని చెప్పారు. అంతకుముందు మరో రాష్ట్రంలో ఈ ఉత్పత్తులను బ్యాన్ చేశారన్నారు. చంద్రబాబు సొంతసంస్థ హెరిటేజ్ ఉత్పత్తుల్లోనే కల్తీ జరుగుతోందని, అసలు జరగనివాటిలో జంతుకొవ్వు కల్తీ అంటూ రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ రాజకీయాలు తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు. కనీసం కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు. ఎన్ని అబద్ధాలు ఆడినా వాస్తవాలను కప్పిపుచ్చలేరని కన్నబాబు పేర్కొన్నారు.


