యథేచ్ఛగా అక్రమరవాణా
చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలు
ఆ చేపలు తింటే అనారోగ్యమని హెచ్చరిస్తున్న వైద్యులు
కోళ్ల వ్యర్థాలతో కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.కోళ్ల వ్యర్థాలను వ్యాన్ల ద్వారా తరలించి అనకాపల్లి జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో చెరువుల్లో పెంచే చేపలకు మేతగా వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యర్థాలను తినే ఆ చేపలను తిన్న ప్రజలు అనేక రోగాల బారిన పడడంతో పాటు రోగ నిరోధకశక్తి కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై నిషేధం ఉన్నా కొందరు అక్రమార్కులు కాసుల కక్కుర్తితో యథేచ్ఛగా తరలిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టాల్సిన రెవెన్యూ,పోలీసు,ఫిషరీస్,రవాణా సహా మరికొన్ని శాఖల అధికారులు మామూళ్లకు తలొగ్గి, అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. – యలమంచిలి రూరల్
సాధారణంగా చేపలు కిలోకి పైగా బరువు పెరిగేందుకు దాదాపు ఆర్నెళ్ల నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. రైతుల నుంచి కిలో బరువున్న చేపలను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.దీంతో చేపల పెంపకంలో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి.అదే మేతగా బ్రాండెడ్ ఫీడ్కు బదులుగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తే నాలుగు నెలలకే కిలో బరువు పెరుగుతున్నాయి.కిలో కోళ్ల వ్యర్థాలు రూ.18 నుంచి రూ.25కే చేపల చెరువుల నిర్వాహకులకు లభిస్తున్నాయి.
దీంతో జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో చేపల చెరువుల నిర్వాహకులు కోడిమాంసం వ్యర్థాలనే కొనుగోలు చేస్తుండడంతో ఈ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాలో ఒక్క దేవరాపల్లి మండలంలో 111 అధికారిక చేపల చెరువులున్నాయి. అనధికారికంగా మరో 50 వరకు ఉన్నాయి. చెరువుల్లో పెంచే చేపలకు తవుడు,మత్స్యశాఖ అధికారులు సూచించిన ఫీడ్ మాత్రమే మేతగా వేయాలి. వీటికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోందని చెరువుల పెంపకందారులు కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తున్నారు.
నెలనెలా భారీగా మామూళ్లు
అక్రమ రవాణాపై 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా,నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది డ్రమ్ముల కోళ్ల వ్యర్థాలను వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు.ఈ వాహనాలను టోల్గేట్లు దాటే సమయంలో, జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు హైవే పెట్రోలింగ్ పోలీసులు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు కట్టడి చేసే అవకాశం ఉంది. అయినా పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఒక్కో వాహనానికి నెలవారీగా ఆయా శాఖల అధికారులకు భారీగా మామూళ్లను ముట్టజెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా కోళ్ల వ్యర్థాలను రవాణా చేసే వాహనాల సంఖ్య ఆధారంగా నెలకు లక్షల్లో అధికారులకు అక్రమ ఆదాయం అందుతోందని సమాచారం.అందుకే వీటిని ఆపేందుకు ఎవరూ ఇష్టపడడం లేదన్న ఆరోపణలున్నాయి.
రూ.లక్షల్లో ఆదాయం
జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారుగా 2వేలకు పైగా కోడి మాంసం విక్రయ కేంద్రాలున్నాయి. నిత్యం 60 టన్నుల కోళ్లు, ఆదివారం ఒక్కరోజే 100 నుంచి 120 టన్నుల కోళ్లను చికెన్ షాపుల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి నెలా సుమారు రెండు వేల టన్నుల వరకు కోళ్లు దిగుమతి అవుతున్నాయి. చికెన్ షాపుల్లో మాంసం విక్రయించగా మిగతా చర్మం,పేగులు,కాళ్లు,ఇతర వ్యర్థాలను షాపుల నిర్వాహకుల దగ్గర్నుంచి కిలో రూ.3 నుంచి రూ.5 వరకు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
పెద్ద షాపుల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేస్తుండగా,చిన్న దుకాణాల నిర్వాహకులు ఉచితంగానే అందజేస్తున్నారు.ఇలా సేకరించిన చికెన్ వ్యర్థాలను అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోగల చేపల చెరువుల వ్యాపారులతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుల వ్యాపారులకు కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.కొందరు చేపల చెరువుల వ్యాపారులే నేరుగా డ్రైవర్లు,సహాయకులను నియమించుకుని చికెన్ వ్యర్థాలను తరలించుకుపోతున్నారు.
ఒక కిలో కోడి మాంసం నుంచి సుమారు 250 నుంచి 300 గ్రాముల చికెన్ వ్యర్థాలు వస్తాయి. జిల్లాలో ప్రతి నెలా 2వేల టన్నుల లైవ్ కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు.వీటి ద్వారా 600 టన్నుల వరకు వ్యర్థాలు వస్తున్నాయి. వ్యాపారులు ఒకసారి వాహనంతో 9 డ్రమ్ముల వ్యర్థాలు తీసుకెళ్తున్నారు.ఒక్కో డ్రమ్ములో 150 నుంచి 200 కిలోల వరకు చికెన్ వ్యర్థాలు ఉంటున్నాయి.
ఒకసారి వాహనంతో చికెన్ వ్యర్థాలు తీసుకెళ్తే ఆ వ్యాపారికి అన్ని ఖర్చులూ మినహాయించి రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వస్తోంది.ఈ లెక్కన నెలకు రవాణా అవుతున్న 2వేల టన్నుల చికెన్ వ్యర్థాలతో సుమారుగా రూ.60 లక్షల వరకు ఆదాయాన్ని కొందరు జేబుల్లో వేసుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా
చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా,వాటిని చే పలకు మేతగా ఉపయోగించడాన్ని సీరియస్గా పరిగణించిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత మార్చి నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో కోళ్ల వ్యర్థాల వాహనాలపై నిఘా పెట్టాలని డీజీపీ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కనీస స్పందన కనిపించడంలేదు.
తూతూ మంత్రంగా దాడులు జరుపుతున్నారు. నెలరోజుల క్రితం అనకాపల్లిలో పోలీసులు దాడులు జరిపి చికెన్ తరలిస్తున్న కొన్ని వాహనాలను పట్టుకున్నారు. విలేకరులు ఎవరైనా చికెన్ వ్యర్థాల వాహనాలను ఆపి ఫొటోలు తీయాలన్నా అక్రమార్కులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.మా వాహనాలను అక్రమంగా ఆపుతున్నారంటూ మీడియా ప్రతినిధులపైనే ఫిర్యాదు చేసి,పోలీసుల సహకారంతో అక్రమ కేసులు సైతం బనాయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆరోగ్యానికి చేటు
చికెన్ వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలను తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ చేపల ద్వారా ఈకోలి బాక్టీరియా శరీరంలోకి చేరి జీర్ణకోశ వ్యాధులు,డయేరియా,కోళ్లకు ఉండే ఫ్లూ మనుషులకు సంక్రమించడం,టైఫాయిడ్ జ్వరం బారిన పడడం జరుగుతుంది.అలాంటి చేపల విషయంలో జాగ్రత్త వహించాలి.వీలైనంత వరకు వాటిని తినకపోవడమే మంచిది. – డాక్టర్ నిహారిక, వైద్యాధికారి, యలమంచిలి సీహెచ్సీ
చర్యలు తీసుకుంటాం
చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై నిఘా పెడతాం.వాటిని తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం.త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా చేసే వాహనాలను తనిఖీ చేస్తాం.చికెన్ వ్యర్థాల రవాణా,నిర్వహణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి.దీనికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు గానీ సమాచారం గానీ ఇవ్వవచ్చు. – కె.వరహాలు, తహసీల్దార్, యలమంచిలి


