రాష్ట్ర శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017–18 వార్షిక బడ్జెట్ మొత్తం మోసాలమయం, లెక్కల మాయాజాల మేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
బడ్జెట్ మాయాజాలంపై ప్రతిపక్ష నేత జగన్ ధ్వజం
► ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం బడ్జెట్లో కనిపించలేదు
► ప్రభుత్వ లెక్కలన్నీ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి
► 11.6 వృద్ధి రేటుతో ఏపీ నం.1స్థానంలో ఉంటే కొత్త లక్ష్యాలెందుకు?
► ప్రత్యేక హోదాపై గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారు
► ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జీఎస్డీపీలో 5.12% అప్పులు తెచ్చారు
► రుణమాఫీపై రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారు
► ఫీజు రీయింబర్స్మెంట్, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీకి అరకొర నిధులేనా?
సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017–18 వార్షిక బడ్జెట్ మొత్తం మోసాలమయం, లెక్కల మాయాజాల మేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఈ బడ్జెట్లో కనిపించ లేదని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం సాయం త్రం విజయవాడలోని ఆర్అండ్బి అతిథిగృహంలో శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో డొల్లతనాన్ని తూర్పారబట్టారు. బడ్జెట్ లో ప్రభుత్వం చూపిన లెక్కలన్నీ రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయన్నారు. బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసినట్లుగా చూపుతున్న ప్రభుత్వ వ్యయానికి వచ్చేటప్పటికి కుదిస్తోందన్నారు. జీడీపీ పెరుగుదల విషయంలో సీఎం అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో జగన్ ఇంకా ఏం చెప్పారంటే...
మనం ప్రపంచంలోనే నంబర్ వన్!
‘‘బడ్జెట్లోని ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఏపీ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11.6 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైందని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి నమోదైతే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగు™ øందని చెప్పవచ్చు. ఒకవేళ ఆ అభివృద్ధి కనుపిం చకపోతే రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్లు లెక్క. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బాబు చెప్పారు. 2022 నాటికి ఏపీ దేశంలోనే ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం కానుందని అంటు న్నారు. 2019 నాటికి ఇలా అవుతుంది, 2050 నాటికి రాష్ట్రం అలా అయిపోతుందని లక్ష్యాలు పెట్టుకుంటు న్నారు. కానీ, ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా సగటు జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంగా ఉంది. ఇక భారతదేశ జీడీపీ 7.1 శాతంగా నమోదైందని ఐఎంఎఫ్ పేర్కొంది. దేశ జీడీపీ 7.1 శాతంగా ఉండగా, సీఎం చెబుతున్నట్లు ఏపీలో 11.6 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉంటే ప్రపంచంలో మనం ఇప్పటికే నంబర్ వన్ స్థానంలో ఉన్నామన్న మాట. మరి అలాంటప్పుడు 2022, 2029, 2050 నాటికి రాష్ట్రం నంబర్ 1 స్థానానికి చేరుతుందని చంద్రబాబు కొత్తగా లక్ష్యాలను నిర్దేశించడం ఏమిటి?
హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు
14వ ఆర్థిక సంఘం నిలిపివేసింది కాబట్టే రాష్ట్రానికి హోదా రావడం లేదని బడ్జెట్లో చెప్పారు. అందుకు సమానమైన ప్రత్యేక సాయాన్ని పొందగలిగామని పేర్కొన్నారు. హోదా ఇవ్వాలని గానీ, ఇవ్వొద్దని గానీ చెప్పడం తమ పరిధిలో లేదని, అలాంటి సిఫార్సులు తాము ఎప్పుడూ చేయలేదని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డితోపాటు సభ్యులు అభిజిత్ సేన్, గోవిందరావు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు వారు ఇచ్చిన లేఖలను నేను యువభేరీ సభల్లో ఎన్నోసార్లు చూపించాను. కానీ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తుంటే నిజంగా బాధేస్తోంది.
నష్టాలు పెరిగితే అవార్డులొచ్చాయా?
ఏపీలో ఉన్న ఎస్పీడీసీఎల్(దక్షిణ), ఈపీడీసీఎల్ (తూర్పు) విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఐదు అవార్డులు వచ్చినట్లు సీఎం ఘనంగా చెప్పుకున్నారు. వాస్తవాలను పరిశీలిస్తే 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు సంస్థలూ రూ.2,394 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు సంస్థలకూ కలిపి నష్టాలు రూ.3,899 కోట్లకు పెరిగాయి. మరి నష్టాలు 62.72 శాతం పెరిగితే అవార్డులు వస్తాయా! ఇక క్రిసిల్ రేటింగ్లు చూస్తే ఒక డిస్కం రేటింగ్ బీ ప్లస్ నుంచి బీకి పడిపోయింది. మరో డిస్కంకు మాత్రం ఉన్న రేటింగే కొనసాగింది. డిస్కంల రేటింగ్లు తగ్గి, నష్టాలు పెరిగితే ఐదు అవార్డులు ఎలా వస్తాయి?
బడ్జెట్ ఉమ్మడిని మించిపోయిందా!
ఏపీ బడ్జెట్ పరిమాణం రూ.1,56,999 కోట్లుగా ఉం ది. విభజనకు ముందు ఉమ్మడి ఏపీ బడ్జెట్ రూ.1,40,742 కోట్లుగా ఉండేది. ఈ ఆర్థిక సంవత్స రంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బడ్జెట్లు కలిపి రూ.3.05 కోట్ల మొత్తానికి పైగానే ఉన్నాయి. అంటే విభజన జరిగి మూడేళ్లు కూడా దాటక ముందే కేవలం ఏపీ బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రం బడ్జెట్ను దాటేసింది. తెలంగాణ బడ్జెట్ కూడా ఉమ్మడి బడ్జెట్ను దాటింది. ఏపీ పరిస్థితి అంత గొప్పగా ఉందా? అని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రచారంలో నిజం లేదని తెలుస్తుంది.
అప్పుల కుప్పను చూపరేం!
2016–17 బడ్జెట్ రూ.1,35,688 కోట్లు ఉంటే, అందులో రూ.1,16,812 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. అయితే, అప్పులు తెచ్చుకున్న విషయం ఎక్కడా చూపలేదు. గత డిసెంబర్ నాటికి రూ.30,953 కోట్ల అప్పులు తెచ్చుకున్నట్లు ‘కాగ్’ నివేదిక పేర్కొంది. ఎఫ్ఆర్బీఎఫ్ నిబంధనల ప్రకారం మొత్తం జీఎస్డీపీలో 3 శాతం కంటే ఎక్కువ అప్పులు తెచ్చుకోవడం వీలు కాదు. అంటే ఏపీ అప్పులు రూ.20,497 కోట్ల కంటే ఎట్టి పరిస్థితుల్లో మించకూడదు. కానీ, బాబు సర్కారు మాత్రం 2016 డిసెంబర్ నాటికే 5.12 శాతం అప్పు తెచ్చుకుంది. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం. ఇక అత్తగారి సొత్తు అన్నట్లుగా పింఛనుదారుల డబ్బును ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం.
పడిపోయిన పంటల దిగుబడి
ఒక్క ఏడాదిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి, 2015–16 ఆర్థిక సంవత్సరంలో 8 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించడం ద్వారా 8 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటకు నీరందించామని బడ్జెట్లో పేర్కొన్నారు. రూ.2,500 కోట్ల విలువగల దిగుబడి సాధించామన్నారు. ప్రస్తుతం 56 టీఎంసీల నీటిని ఖరీఫ్ సాగుకు మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలోనే 10.6 లక్షల ఎకరాల పంటను కాపాడగలిగామన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేను గమనిస్తే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008–09లో 42.70 లక్షల హెక్టార్లలో పంటలు వేసి 1,66,016 టన్నుల దిగుబడిని రాష్ట్రం సాధించింది. 2014–15లో 41.36 లక్షల హెక్టార్లలో పంటలు వేసి 1.43 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. అదే విధంగా 2016–17లో 41.34 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తే 1.56 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్లు టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత విస్తీర్ణంతోపాటు పంటల దిగుబడి కూడా తగ్గింది. మరో నివేదిక ప్రకారం స్థూలంగా సాగయిన భూమిని చూస్తే 2013–14లో 40.96 లక్షల హెక్టార్లు ఉంటే 2014–15లో అది 38.86 లక్షల హెక్టార్లకు పడిపోయింది. 2015–16లో 35.47 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అదే నెట్ ఇరిగేటెడ్ ఏరియాను చూస్తే 2013–14లో 30.14 లక్షల హెక్టార్లు కాగా, 2014–15లో 29.27 లక్షల హెక్టార్లు, 2015–16లో పట్టిసీమ నుంచి నీటిని కృష్ణాలో కలిపామని ప్రభుత్వం చెప్పుకుంటున్న తర్వాత కూడా 27.43 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
పులిచింతలకు రూ.127 కోట్లిస్తే చాలు...
పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.136.45 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించి, 42 టీఎంసీల నీటిని తీసుకొస్తే, ప్రకాశం బ్యారేజీ నుంచి 55 టీఎంసీల నీటిని సముద్రంలోకి పంపించారు. పక్కనే ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు రూ.127 కోట్లు కడితే చాలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామాలను ఖాళీ చేయిస్తామని తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా అడుగుతోంది. ఆ డబ్బు కడితే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలను నిలువ చేసుకోవచ్చు. అదే కనుక జరిగి ఉంటే ఇవాళ కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితే వచ్చేది కాదు. ఇదీ చంద్రబాబుకున్న గొప్ప విజన్ (దార్శనికత).
బాబు వచ్చారు.. బంగారం వేలం వేస్తున్నారు
రుణమాఫీ కోసం ఈ బడ్జెట్ రూ.3,600 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకూ మూడేళ్లలో రుణ మాఫీ పథకానికి రూ.10,600 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు ఇచ్చారని అనుకోవచ్చు. రైతుల వ్యవసాయ రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉంటే చంద్రబాబు ఏడాదికి ముష్టివేసినట్లు రూ.3,500 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినట్లు చెబుతూ రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్స్ పెడుతున్నారు. రైతులు ప్రతి సంవత్స రం వడ్డీ కింద రూ.16,000 కోట్లు చెల్లిస్తున్నారు. వడ్డీలో పావలా వంతు భాగం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు రైతులకు పంట రుణాలు అందడం లేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. కానీ, బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ నోటీసులు ఇచ్చాయి. గతంలో వడ్డీ లేకుండా రూ.లక్ష వరకూ, పావలా వడ్డీతో రూ.3 లక్షల రుణం లభించేది. ఇవాళ వడ్డీలేని రుణ పథకానికి కేవలం రూ.172 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ కింద ఇచ్చే రుణాలకు రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు.
డ్వాక్రా మహిళలపై తొలగని రుణ భారం
డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు మైకులు పట్టుకుని చెప్పాడు. ఇప్పుడు దాని గురించి నోరెత్తడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. వాటిని చెల్లించవద్దని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు కాబట్టి మహిళలు చెల్లించలేదు. ఇవాళ బ్యాంకులు ఆ అప్పులపై 18 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆ వడ్డీ సంవత్సరానికి రూ.2,600 కోట్లు. మూడేళ్లలో రూ.7,500 కోట్లు ఇప్పటికే దాటిపోయింది. నాలుగో సంవత్సరం వచ్చింది కాబట్టి డ్వాక్రా మహిళలపై వడ్డీ భారమే రూ.10 వేల కోట్లు. పైగా వారికి రూ.4,900 కోట్లు అప్పు ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. మళ్లీ రూ.1,600 కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్(పెట్టుబడి నిధి) కింద ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు.
చదువులకు మంగళం పాడాల్సిందేనా?
ఫీజు రీయింబర్స్మెంట్కు బడ్జెట్లో రూ.1,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015–16లో 15,13,883 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేస్తే, ఇందులో భారీగా కోతలు విధించారు. వీరికి రూ.2,578 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ప్రభుత్వం విడుదల చేసింది రూ.1,579 కోట్లు మాత్రమే. అంటే ఈ సంవత్సరంలో బకాయిలే రూ.999 కోట్లు ఉన్నాయి. 2016–17లో 15,80191 మంది దరఖాస్తు చేస్తే 14.42 లక్షల మందికి తగ్గించారు. వారికి ఇవ్వాల్సింది రూ.2,481 కోట్లయితే ఇచ్చింది మాత్రం రూ.527 కోట్లే. అంటే ఇంకా రూ.1,954 కోట్లు ఇవ్వాలి.
100 కోట్లతో 7.50 లక్షల మరుగుదొడ్లా..!
రాష్ట్రంలో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించబోతున్నా మని, ఏపీ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రమని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక హాస్టల్కు వెళ్ళాను. అక్కడ మరుగుదొడ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. నీళ్లు లేవు. పొద్దున్నే ఎక్కడికి వెళ్తారని పిల్లలను అడిగితే చెంబులు, బాటిళ్లు పట్టుకుని కొండలు ఎక్కుతున్నామని చెప్పారు. 7.50 లక్షల మరుగుదొడ్లు కడతానని చెప్పిన చంద్రబాబు దానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు కేవలం రూ.100 కోట్లు. 7.50 లక్షల మరుగుదొడ్లు కట్టాలంటే ఒక్కొక్కటీ రూ.15 వేలు వేసుకున్నా రూ.1,050 కోట్లు కావాలి.
ముగ్గులేనా.. ఇళ్లు నిర్మిస్తారా?
రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు కడతామని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఇళ్లు కట్టిస్తామని మూడేళ్లు గా చెబుతున్నారు. ప్రస్తుతం 48 వేల ఇళ్లకు ముగ్గులు (మార్కింగ్) వేశామంటున్నారు. గతేడాది బడ్జెట్లో గృహాలకు రూ.1,321 కోట్లు కేటాయిస్తే రూ.490 కోట్లే ఖర్చు చేశారు. ఈ సొమ్ములోనూ రూ.132 కోట్లు వేతనాలకే ఖర్చయ్యింది. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.1,455 కోట్లు కేటాయించగా, కేపిటల్ కింద రూ.129 కోట్లు పెట్టారు. అంటే ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో బాబుకే తెలియాలి.
ఎస్సీ, ఎస్టీలపై ముఖ్యమంత్రి డాంబికాలు
ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు చూస్తే తెలుస్తుంది. 2016–17లో రూ.9,457 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేశామన్నారు. అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.5,673 కోట్లే. అంటే ఖర్చు 59 శాతానికి మించలేదు. ఎస్టీలకు సంబంధించి రూ.3,435 కోట్లకుగానూ రూ.2,187 కోట్లు ఖర్చు చేశారు.
ఖర్చు పెట్టకపోయినా జనం పడి ఉంటారులే!
చంద్రబాబు హయాంలో బడ్జెట్ కేటాయింపులకు అర్థమే లేకుండాపోయింది. ముందుగా మాటలు చెబితే పనైపోతుంది, ఆ తరువాత ఖర్చు పెట్టినా.. పెట్టకపోయినా ప్రజలు పడి ఉంటారులే అన్నది బాబు నైజం. పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకునేట ప్పుడు మంత్రి పదవులిస్తామంటూ తొలుత ఆశలు చూపారు, ఆ తర్వాత వారు ఇంకెక్కడికి పోతారు, పడి ఉంటారులే అనే ఉద్దేశంతో మాటను దాటవేస్తారు.
బీసీలకు బాబు దగా
బీసీల సంక్షేమం కోసం గత మూడేళ్లలో కేటాయింపుల మేరకు ఖర్చు పెట్టలేదు. 2014–15లో రూ.2,665 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.2,242 కోట్లు ఖర్చు చేశారు. 2015–16లో రూ.3,195 కోట్లకుగాను రూ.2,573 కోట్లు ఖర్చు పెట్టారు. 2016–17లో రూ.5,103 కోట్లకు గాను కేవలం రూ.4,338 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చూపారు. ఇలా ప్రతి అంశంలోనూ మోసమే కనిపిస్తోంది.
ముష్టి వేసినట్లుగా నిరుద్యోగ భృతి
జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. జాబు వచ్చేంత వరకూ ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ మెనిఫెస్టోలో కూడా పెట్టారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇలా ఇంటికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.3,500 కోట్లు.. ఏడాదికి రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం బడ్జెట్లో ముష్టి వేసినట్లుగా కేవలం రూ.500 కోట్లు విదిల్చారు.
ఆరోగ్యశ్రీకి అరకొర నిధులే
ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో అరకొరగా రూ.1,000 కోట్లే కేటాయించారు. గతేడాది 910 కోట్లు అడిగితే బడ్జెట్లో రూ.500 కోట్లే కేటాయించారు. ప్రకాశం జిల్లాలో మేము ధర్నాలు చేస్తే మరో రూ.262 కోట్లు ఇచ్చారు. 2015–16 కింద రూ.280 కోట్ల బకాయిలు ఉన్నాయి. 2016–17 కింద ఇంకా రూ.488 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘108’ కోసం అధికారులు రూ.75 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం ఇచ్చింది రూ.60 కోట్లు. బకాయిలు రూ.15 కోట్లు ఉన్నాయి. ‘104’కు రూ.80 కోట్లు అడిగితే రూ.37.5 కోట్లు కేటాయించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం అందించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ బాధితుల పరిస్థితి దారుణంగా తయారైంది.
పవన్ కల్యాణే కాదు... ఎవరినైనా కలుపుకుపోతాం..
పవన్ కల్యాణ్ గురించి విలేకరులు ప్రస్తావించగా జగన్ స్పందిస్తూ.... ‘‘ప్రస్తుతం పవన్ పరిస్థితి చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్(కూర్చొమ్మంటే కూర్చుం టాడు, నిల్చోమంటే నిల్చుంటాడు) అనే విధంగా ఉంది. ముందు ఆయన ఆ పరిస్థితు ల్లో నుంచి బయటపడాలని కోరుకుంటు న్నాను. చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయా లపై పోరాడడానికి ఎవరు ముందుకొచ్చినా ఆప్యాయంగా ఆహ్వానిస్తాం. కలుపుకునే కార్యక్రమం చేస్తాం’’ అని స్పష్టం చేశారు.