శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ టి.జయప్రకాశ్రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొండాపూర్ మండలం గిర్మాపూర్లోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జయప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ దేశం గర్వపడేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని సూచించారు. తన సొంత నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ వేడుకలు జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఆవిష్కర్తలుగా ఎదగాలి..
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకుని ఆవిష్కర్తలుగా ఎదగాలని ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మళ్లించటం సరికాదన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యార్థులు పరిశోధనలవైపు మళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ దినకర్బాబు మాట్లాడుతూ సైన్స్ఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. బాలమేధావులైన విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను సైన్స్రంగం వైపు ఆకర్షింపజేసేందుకు ప్రేరణ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రగతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయిలో 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వచ్చేనెల 8 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు.
ప్రతిభను చాటేందుకు చక్కని వేదిక..
మూడురోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ మెదక్ జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని డీఈఓ జి.రమేశ్ అన్నారు. 11 జిల్లాకు చెందిన 625 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. విద్యార్థులు తమలోని ప్రతిభాపాటవాలను చాటిచెప్పేందుకు సైన్స్ఫెయిర్ చక్కని వేదికని పేర్కొన్నారు. సైన్స్ఫెయిర్ ద్వారా విద్యార్థులు శాస్త్రసాంకేతిక రంగాల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందన్నారు.
ప్రశంసలతో ముంచెత్తిన అతిథులు..
సైన్స్ఫెయిర్ను ప్రారంభించిన అనంతరం అతిథులు విప్ జయప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, కలెక్టర్ దినకర్బాబు తదితరులు విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు.
విప్ జయప్రకాశ్రెడ్డి నీటిపంపు సైకిల్ను తొక్కి నీటి సరఫరా ఎలా జరుగుతుంది పరిశీలించారు. అనంతరం ఆ నమూనా తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో తహశీల్దార్ గోపాల్, ఎంపీడీఓ హరిసింగ్, ఎంఈఓ చంద్రశేఖర్, గిర్మాపూర్ సర్పంచ్ కృష్ణ, కమిటీ సభ్యులు విజయరాజు, ప్రభాకర్, రాంచందర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.