
బడ్జెట్లో హోదాపై తేల్చేసిన యనమల!
ఇది ఏపీ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పిన మాట..
విజయవాడ: 'రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాం. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము' ఇది ఏపీ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, హక్కు అయిన ప్రత్యేక హోదాను వదులుకున్నట్టు ఆయన ఈ ప్రసంగం ద్వారా చెప్పకనే చెప్పేశారు. ప్రత్యేక హోదా కోసం ఓ వైపు ప్రజలు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ.. హోదాను వదిలేసి ప్యాకేజీ కోసం పాకులాడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో యనమల ప్రకటన చేయడం విమర్శలకు తావిస్తున్నది.
రెండు నెలల కిందట ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా విశాఖలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఆ పార్టీ నేతలను విమానాశ్రయంలోనే నిరంకుశంగా బధించి.. అనంతరం హైదరాబాద్కు చంద్రబాబు సర్కారు తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం మరో దఫా పోరాటం కోసం వైఎస్ఆర్సీపీ, ప్రజలు సిద్ధమవుతుండగా.. హోదా లేదంటూ యనమల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం ఏపీ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నది.