
సాక్షి, అమరావతి : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ కీలక రంగాలకు మొక్కుబడి కేటాయింపులు జరిపింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన నీటిపారుదల రంగానికి కేవలం రూ 16,978 కోట్లే కేటాయించింది. వీటిలో పోలవరానికి రూ 9,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు గత నాలుగేళ్లలో కేవలం రూ 8000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రూ 9000 కోట్లు ఎలా ఖర్చుచేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పెరిగిన అంచనా వ్యయాల నేపథ్యంలో నిర్మాణ దశలో ఉన్న పలు ప్రాజెక్టులకు ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగానికి రూ 12,355 కోట్లు కేటాయించింది. కరవు, గిట్టుబాటు ధరలు లేక సతమతమవుతున్న అన్నదాతను ఆదుకునే క్రమంలో ఇవి అరకొర నిధులే.