
వచ్చే 4 రోజులు విస్తారంగా వర్షాలు
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని,
బంగాళాఖాతంలో అల్పపీడనం
మంగళవారం పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు
నెట్వర్క: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలుపడే అవకాశం ఉందని ప్రకటించింది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం తెలిపారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వచ్చే నెలలో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. ఈ నెల చివరి ఐదు రోజులే కీలకమని చెప్పారు.
పలుచోట్ల భారీ వర్షాలు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మహబూబాబాద్లో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇంత భారీగా వర్షపాతం నమోదుకావడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జిల్లాలోని కాగ్నా నది తాండూరు వద్ద ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి కారణంగా తాండూరు-మహబూబ్నగర్ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వాగులు, వంకలు పోటెత్తాయి. బొంకూరులో పెద్దవాగు పొంగిపొర్లడంతో రాయచూర్కు వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
గ్రేటర్లో 4.3 సెం.మీ. వర్షం
గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు 4.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కోఠీ, అబిడ్స్, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్సార్నగర్, బేగంపేట్, సికింద్రాబాద్ ప్రాంతాలల్లోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
పంటలకు ప్రాణం: వర్షాభావంతో పంటలు ఎండిపోయే స్థితికి చేరడంతో ఆశ వదులుకున్న రైతుల్లో ఈ వర్షాలు కొత్త ఆశలు నింపుతున్నాయి. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంట లకు వర్షాలు ప్రాణం పోశాయని వ్యవసాయశాఖ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరి వేయనివారు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద: శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం 1,66,588 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 82,566 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఒక్క రోజులోనే వరద రెట్టింపయింది.