ఇదేమి శిక్షణ? | what is this trainning? | Sakshi
Sakshi News home page

ఇదేమి శిక్షణ?

Feb 8 2014 2:57 AM | Updated on Jun 1 2018 8:47 PM

వెనుకబడిన తరగతుల (బీసీ)కు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది.

 సాక్షి, అనంతపురం :  వెనుకబడిన తరగతుల (బీసీ)కు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో శిక్షణ పొందే వారికి నెలకు రూ.750 స్టైఫండ్, సబ్జెక్ట్ మెటీరియల్ కోసం రూ.350 చొప్పున చెల్లిస్తోంది. శిక్షణ ఇచ్చే టీచర్లు గంట 30 నిమిషాలు క్లాసు తీసుకుంటే రూ.350 ఇస్తోంది. అయితే, స్టైఫండ్ మిగిల్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి కొత్త నిబంధన విధించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఉన్న వారిని మాత్రమే శిక్షణకు అనుమతిస్తోంది.
 
 ఈ నిర్ణయం వల్ల పలువురు అభ్యర్థులు శిక్షణ కు దూరమవుతున్నారు. ప్రస్తుతం వివిధ కోర్సులు చదువుతున్న వారు టీసీలు తీసుకురావాలంటే సాధ్యపడదు. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. ఇటీవల వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల కోసం బీసీ స్టడీ సర్కిల్‌లో 200 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీసీ ఉన్న వారికి మాత్రమేనన్ననిబంధన వల్ల 38 మంది మాత్ర మే ఎంపికయ్యారు.
 
  ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం 50 మందికి శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లభించగా... టీసీలు సమర్పించలేదనే కారణంతో ఎనిమిది మందిని పక్కనబెట్టారు. గ్రూప్-1, 2 శిక్షణలోనూ ఇదే తీరు. వంద మందికి అవకాశమున్నా... 84 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సొల్యూషన్స్ (ఐబీపీఎస్) ఉద్యోగాల కోసం 50 మందికి శిక్షణ ఇవ్వాల్సి వుండగా 30 మంది, సివిల్స్ శిక్షణ కోసం 60 మందికి గాను 25 మంది, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు వంద మందికి గాను 50 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇదిలా వుండగా గతంలో శిక్షణ పొందే సమయంలోనే అభ్యర్థులకు స్టైఫండ్, మెటీరియల్ ఖర్చులు ఇచ్చేవారు.
 
 ప్రస్తుతం ఆ విధానాన్ని ప్రభుత్వం మార్చింది. శిక్షణ పూర్తయిన తర్వాత బ్యాంకు అకౌంట్లకు జమ చేసేలా నిబంధనలు మార్చింది. దీనివల్ల ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్‌లో శిక్షణకు వస్తున్న అభ్యర్థులు స్థానికంగా ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు పోటీ పడుతున్న వారికి శిక్షణ కాలం ముగుస్తున్నా ఇంతవరకు స్టైఫండ్ అందలేదు. కాగా.. బీసీ స్టడీ సర్కిల్‌కు కొంత కాలంగా రెగ్యులర్ డెరైక్టర్ లేరు. అభ్యర్థుల ఇబ్బందులపై ఇన్‌చార్జులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement