దేశంలో ఎక్కడా లేనివిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి స్వర్ణయుగ పాలన
సంక్షేమ పథకాల ఘనత వైఎస్దే
Dec 29 2013 3:29 AM | Updated on Jul 7 2018 2:56 PM
మోర్త (ఉండ్రాజవరం), న్యూస్లైన్ :దేశంలో ఎక్కడా లేనివిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి స్వర్ణయుగ పాలన అందించారని మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ పేర్కొన్నారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు, సొసైటీ అధ్యక్షుడు ఆలపాటి నరేంద్రప్రసాద్ తనవర్గంతో వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్కృష్ణ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి మోర్త గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సుభాష్చంద్రబోస్ మాట్లాడారు.
దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకువచ్చారని, వారి బాటలో ప్రజాసేవే ధ్యేయంగా నేడు వైసీపీ పయనిస్తోందని వివరించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న పార్టీ వైసీపీయేనన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి విజయం దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి, అండగా ఉండాలని ప్రజలను కోరారు.
రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డు అనంతవెంకటరమణచౌదరి మాట్లాడుతూ ఉండ్రాజవరం మండలంలో టీడీపీ కంచుకోటగా ఉన్నా, వైసీపీ ఇక్కడ ఎంతో బలపడుతోందన్నారు. రాజీవ్కృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. పార్టీలో చేరిన ఆలపాటి నరేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన నాయకత్వంలో పార్టీకి సేవచేయడానికి తన వర్గంతో వైసీపీలో చేరినట్టు చెప్పారు. పార్టీలో చేరినవారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నాయకులు చిట్టూరి నరేంద్ర, తలారి వెంకట్రావు, సువర్ణరాజు, నందిగం భాస్కరరామయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిల్లి వెంకట్రావు, పిండ్రా పోశయ్య, గుణ్ణం రవికుమార్, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement


