ఇదీ అనంతపురం జిల్లాలో రైతుల వ్యథాభరిత జీవితాలు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసాయాత్రలో పెల్లుబుకిన ఆవేదన ఇదీ..
సాక్షి నెట్వర్క్: ఇదీ అనంతపురం జిల్లాలో రైతుల వ్యథాభరిత జీవితాలు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో పెల్లుబుకిన ఆవేదన ఇదీ.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు తమ కష్టాలను జగన్తో చెప్పుకుని భోరుమంటున్నారు. ‘‘చంద్రబాబు ఏం చెబుతారో, ఏం చేస్తారో తెలియదు? ఆయన ధోరణి ఆయనదే? రాష్ట్రంలో రూ.87వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా తొలి విడతగా కేవలం 12 వేల కోట్లే విడుదల చేశారు. ఆ మొత్తంతో వడ్డీ కూడా మాఫీ కాలేదు. ఆయన పాలనలో ఈ ఐదేళ్లూ కష్టాలు తప్పవు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యల జోలికి వెళ్లవద్దు. మీకు నేనున్నా. మనకూ మంచి రోజులు వస్తాయి. అప్పటివరకూ ధైర్యంగా ఉండండి’’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు. రెతు భరోసాయాత్ర మూడో రోజైన బుధవారం గుంతకల్లు నియోజకవర్గంలో సాగింది. మొదటగా గుత్తి మండలం లచ్చానుపల్లికి చెందిన రైతు కె.శ్రీకాంత్రెడ్డి కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. రైతు భార్య కె.లక్ష్మి, తండ్రి లింగారెడ్డి, తల్లి లక్ష్మిదేవితో వివరాలడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం గుంతకల్లు మండలం వైటీచెరువు గ్రామానికి చెందిన రైతు కురాకుల సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత గుండాల గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బండారు నెట్టెప్ప కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. శాసనసభలో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తానని ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పత్రాన్ని జగన్ తీసుకున్నారు. నెట్టెప్ప కుటుంబానికి రూ.50వేలు సాయం అందించారు. చివరగా బుధవారం రాత్రి ఆయన పాత గుంతకల్లుకు చెందిన రేషన్డీలర్ మధుబాబు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
పింఛన్లకోసం కలెక్టరేట్లను ముట్టడిద్దాం: జగన్
అనంతపురం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు సర్కారు మానవత్వంలేకుండా వ్యవహరిస్తోంది... పండు ముదుసళ్లకు ఇచ్చే పింఛన్లలోనూ కోతలు పెడుతుంది... ఎవరైనా చనిపోతే, టీడీపీ కార్యకర్తలు చెప్పినవారికే కొత్త పింఛన్లు ఇస్తున్నారు... ఈ అన్యాయాన్ని సహించవద్దు... అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కలెక్టరేట్లను ముట్టడిద్దాం... ప్రభుత్వాన్ని స్తంభింపచేద్దామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. పాతకొత్తచెరువు గ్రామంలో నరసమ్మ అనే వృద్ధురాలు తనకు పింఛను ఇవ్వడంలేదని జగన్ వద్ద వాపోయినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. తన భర్త పెద్దన్న విద్యుత్ షాక్ కొట్టి చనిపోతే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని లచ్చానుపల్లికి చెందిన పెద్దక్క తన గోడు వెల్లబోసుకున్నారు. తనకు యూక్సిడెంట్ జరిగి నడుములు విరిగినా నష్టపరిహారం అందలేదని గుంతకల్లులోని మిల్కాలనీకి చెందిన బండ్ల సారాబీ వాపోయారు.
ఈ విషయాలపై ప్రైవేటు కేసు వేసి న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాలు ఇప్పటివరకూ మాఫీ కాలేదని లచ్చానుపల్లిలో మహిళాకూలీలు జగన్కు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఈ సమస్యల పరిష్కారం కోసమే వచ్చేనెల గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేయనున్నట్లు జగన్ వారికి చెప్పారు.
వైఎస్ జగన్తో రైతు కుటుంబాల ఆవేదన
ఒకటిన్నర ఎకరా పొలంలో 12 బోర్లు వేయించినా నీళ్లు పడలేదు. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. రెన్యూవల్ చేసుకోకపోవడంతో పంట బీమా కూడా దక్కలేదు. అప్పులు ఎక్కువై నా భర్త సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లల చదువు విషయమే పెద్ద బెంగగా ఉంది.
- రామాంజినమ్మ, వైటీచెరువు, గుంతకల్లు మండలం
నాకు ఆరెకరాల పొలం ఉంది. పత్తి, ఆముదం, వేరుశనగ సాగు చేశాం. బ్యాంకులో లక్ష, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3.5 లక్షలు అప్పులు చేసి వ్యవసాయం చేశాం. పంటలు సరిగా పండకపోవడంతో అప్పుల బాధ తాళలేక నా కుమారుడు శ్రీకాంత్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
- లింగారెడ్డి, లచ్చానుపల్లి, గుత్తి మండలం
చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. అప్పుల బాధ భరించలేకే నా తండ్రి నెట్టెప్ప ప్రాణం తీసుకున్నారు. గుంతకల్లులోని కెనరా బ్యాంకులో నా తండ్రి పేరిట రూ.53 వేలు, అమ్మ పక్కీరమ్మ పేరిట రూ.55వేలు రుణం తీసుకున్నాం. నాన్న పేరిట రూ.7400లు, అమ్మ పేరిట రూ.7800లు రుణం మాత్రమే మాఫీ అయ్యింది. కుటుంబం గడవడానికి ఉపాధిహామీ పనులకు వెళ్తున్నా.
- శ్రీనివాసులు, గుండాల, గుంతకల్లు మండలం
టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి నా అన్నను వేధించారు. రేషన్షాపు రద్దు చేయించారు. రెండుసార్లు స్టే తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఒత్తిళ్లు తాళలేక మా అన్న మధుబాబు మార్చి 19న ఆత్మహత్య చేసుకున్నారు.
- గీతాంజలి, పాత గుంతకల్లు