వేస్ అండ్ మీన్స్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం | Ways and Means government shelters | Sakshi
Sakshi News home page

వేస్ అండ్ మీన్స్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం

Jan 20 2015 1:25 AM | Updated on Sep 2 2017 7:55 PM

చరిత్ర పునరావృతమైంది. రాష్ట్రం మళ్లీ ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. గతంలో చంద్రబాబు పాలనలో తరచూ వేస్ అండ్ మీన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.

సాక్షి, హైదరాబాద్: చరిత్ర పునరావృతమైంది. రాష్ట్రం మళ్లీ ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. గతంలో చంద్రబాబు పాలనలో తరచూ వేస్ అండ్ మీన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.బాబు తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన 1995 నుంచి తిరిగి గద్దె దిగేవరకు రాష్ట్రానిది ఓవర్ డ్రాఫ్టుల పరిస్థితే. మళ్లీ అదే గడ్డు పరిస్థితిని ఇప్పుడు ఆయన హయాంలోనే రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రంతో మొరపెట్టుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవని తెలిపారు.  ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ప్రభుత్వం వేజ్ అండ్ మీన్స్‌ను ఆశ్రయించింది. సోమవారం రూ.470 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లింది. వేస్ అండ్ మీన్స్‌కు వె ళ్లడం అంటే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడమే. ఈ విధానంలో  రూ.1,500 కోట్లవరకు వెళ్లవచ్చని రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్నారు. ఆపై అవకాశం లేదు.

ఈ నిధులు అయిపోతే ఇక ఓవర్‌డ్రాఫ్ట్ ఒక్కటే దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఓవర్‌డ్రాఫ్టుకు త్వరలో వెళ్లవచ్చని తెలుస్తోంది. ఆ దిశకూ వెళ్లే అవకాశముందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఇక బడ్జెట్లో పేర్కొన్న మేరకు రాష్ట్రం తన సెక్యూరిటీల విక్రయం ద్వారా జనవరి నుంచి మార్చి వరకు రూ.3 వేల కోట్లు అప్పు చేసే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఇదివరకే కేంద్రం ఇందుకు అనుమతించింది. ఈ అప్పు చేసుకునే అవకాశమున్నప్పటికీ దాన్ని వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement