ఓటుకు ‘తెలుగు’ నోటు | Vote 'Telugu' note | Sakshi
Sakshi News home page

ఓటుకు ‘తెలుగు’ నోటు

Mar 27 2014 3:01 AM | Updated on Sep 2 2017 5:12 AM

ఓటుకు ‘తెలుగు’ నోటు

ఓటుకు ‘తెలుగు’ నోటు

మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు నాలుగురోజుల ముందే ఓటర్లకు పలు రకాల తాయిలాలు అందజేస్తున్నారు.

  • ఓటుకు రూ.500 పంచి ఒట్టేసుకుంటున్న తెలుగుతమ్ముళ్లు
  •      పోలింగ్‌కు నాలుగురోజులకు ముందే ప్రలోభాలు
  •      పుత్తూరులో  మూడు వార్డుల్లో నగదు పంపిణీ
  •      హస్తిలో నాలుగు వార్డుల్లో పంపకం పూర్తి
  •      మదనపల్లెలో ఓటర్ల ఇంటికి వస్తువులు, బియ్యం
  •   సాక్షి, చిత్తూరు: మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు నాలుగురోజుల ముందే ఓటర్లకు పలు రకాల తాయిలాలు అందజేస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి నిఘా ఎక్కువగా ఉంటుందని భావించి నగదు పంపిణీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ప్రధానంగా చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు రాత్రి సమయాల్లో పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. ఓటర్ల లిస్టు ఆధారంగా ఓటుకు రూ.500 ఇస్తున్నట్లు సమాచారం. మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది.
     
    పుత్తూరు పట్టణంలో  వైఎస్సార్‌సీపీ కచ్చితంగా గెలుస్తుందనుకున్న వార్డులను వదిలేసి, మిగిలినవార్డుల్లో తెలుగుతమ్ముళ్లు డబ్బులు పంపిణీ చేసినట్లు ఆ పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఓటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారని వారు చెబుతున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలోని నాలుగువార్డుల్లో కూడా ఓటుకు *500 చొప్పున డబ్బులు పంచి, ఓటేస్తామని ప్రమాణం చేయించుకున్నట్టు సమాచారం.

    చిత్తూరు కార్పొరేషన్‌లో ఇప్పటికే భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. డబ్బులు పంచి ఓటర్లను ఆకట్టుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శివారు డివిజన్లలో అర్ధరాత్రి నగదు పంచుతున్నట్టు తెలిసింది. పుంగనూరు మున్సిపాలిటీ, మదనపల్లె మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బులతో పాటు బియ్యం కూడా అందజేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిసింది.  

    మదనపల్లెలో  టీడీపీ అభ్యర్థికి చెందిన బియ్యం బ్యాగ్‌లను  కూడా పోలీసులు పట్టుకున్నారు. పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు డబ్బులు కన్నా  చీరలు, ముక్కుపుడకలు పంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. నగరి మున్సిపాలిటీలోనూ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము  సొంతంగానైనా డబ్బులు పంచాల్సిందేనని తమ్ముళ్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఆరు మున్సిపాలిటీలు, చిత్తూరు కార్పొరేషన్లో అభ్యర్థులు ఓటర్లకు నోటు తాయిలం ఇచ్చేందుకు రంగంలోకి దిగేశారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement