మాస్క్‌ ధరించండి..మాన్విని రానివ్వొద్దు : సూసైడ్‌ నోట్‌ కలకలం | Maanvi Outside : Gujarat Man Note For Daughter Before Killing Self | Sakshi
Sakshi News home page

మాస్క్‌ ధరించండి..మాన్విని రానివ్వొద్దు : సూసైడ్‌ నోట్‌ కలకలం

May 30 2026 2:59 PM | Updated on May 30 2026 3:06 PM

Maanvi Outside : Gujarat Man Note For Daughter Before Killing Self

కనిపెంచిన తల్లిదండ్రులు,తోబుట్టువులు, భార్యాబిడ్డలు.. ఇలా అందర్నీ మరిచి, జీవితంమీద ఆశ కోల్పోయి తీసుకునే నిర్ణయమే ఆత్మహత్య. కానీ అంత నిస్సహాయ స్థితిలో తన ప్రాణాలు తీసుకునే చివరి క్షణాల్లో కూడా జరగబోయే ప్రమాదాన్ని గమనించి, తన కుటుంబం, ముఖ్యంగా చిన్న కూతురు మాన్వి, ఇతరులు క్షేమంగా కూడా  ఉండాలని ఆయన ఆలోచించిన తీరు అందరినీ కదిలిస్తోంది.  

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఈ  విషాద ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  అయితే చనిపోయే తలుపుపై రాసిన చివరి లేఖ  మాత్రం  అందర్ని కదిలించింది.


ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు, ఆ వ్యక్తి తన ఫ్లాట్ తలుపుపై ఇంగ్లీష్‌లో ఒక హెచ్చరిక లేఖను అంటించాడు. అందులో "సెల్ఫాస్ (Celphos), విషవాయువు, మాస్క్ ధరించండి, నీళ్లు తాగొద్దు" అని రాసి ఉంది. ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ విషవాయువు వల్ల ముఖ్యంగా తన చిన్న కూతురు మాన్వి, కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతోఆయన ఈ హెచ్చరిక చేశాడు.'సెల్ఫాస్' అనేది అత్యంత విషపూరితమైన క్రిమిసంహారక మందు.

మృతుడు పంకజ్ భన్సాలీ (42) గాంధీనగర్‌లోని కుడసన్ ప్రాంతంలో గల పూనమ్ రెసిడెన్సీ ఫ్లాట్‌లో నివసించేవాడు. ఇన్‌ఫోసిటీలోని ఒక స్టాక్ మార్కెట్ సంస్థలో పనిచేసే ఆయన, దాదాపు ఐదు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం పోవడంతో పాటు అప్పులు, నష్టాల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. 

పంకజ్ భన్సాలీ భార్య, కూతురు మే 13న పుట్టింటికి వెళ్లారు. భార్యాభర్తలు చివరి సారిగా మే 22న ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువులు మే 27న ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. మే 22న లేదా  ఆ తరువాత గానీ భన్సాలీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల పాటు మృతదేహం మూసి ఉన్న ఇంట్లోనే ఉండటం వల్ల పూర్తిగా కుళ్ళిపోయింది.

ఇన్‌ఫోసిటీ పోలీసులు ఘటనా స్థలం నుండి విషపూరిత క్రిమిసంహారక మందును స్వాధీనం చేసుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement