
రూ.400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి
ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి బస్వరాజు సారయ్య హామీ ఇచ్చారు. ఎంజీఎం ఆస్పత్రిలో కలెక్టర్ కిషన్ అధ్యక్షతన ఆదివారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (హెచ్డీఎస్) సమావేశం జరిగింది.
ఎంజీఎం, న్యూస్లైన్ :
ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి బస్వరాజు సారయ్య హామీ ఇచ్చారు. ఎంజీఎం ఆస్పత్రిలో కలెక్టర్ కిషన్ అధ్యక్షతన ఆదివారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (హెచ్డీఎస్) సమావేశం జరిగింది. 15 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించారు. 57 సంవత్సరాల క్రితం నిర్మించిన మెడిసిన్, సర్జరీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎంజీఎం క్యాజువాలిటీని 30 పడకల సామర్థ్యం ఉండేలా మెరుగు పరచాలని, 500 పడకలతో కూడిన హాస్టల్ సౌకర్యం కల్పించాలని, ఎంసీఐ నిబంధనల ప్రకారం అన్ని విభాగాల్లో మరో యూనిట్ పెంచాలని, ప్రభుత్వ పరంగా సిటీ, మెడల్ స్కానింగ్ సౌకర్యం కల్పించాలని, సూపర్స్పెషాలిటీ రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని, పీఆర్ఓ సిబ్బందిని కొనసాగించాలని, ట్రామా సెంటర్ను మంజూరు చేయించాలని, అదనంగా మరో 50 అద్దె గదులను రోగుల అందుబాటులోకి తేవాలనే అంశాలపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. యూజీసీ స్కేల్ తీసుకుంటున్న వైద్యులు నిబంధనల ప్రకారం పనిచేయాలని, డ్యూటీ డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు.
ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి * 150 కోట్లు కేటాయించారని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.20 లక్షలతో రెండు వెంటిలేటర్లను సైతం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
{పభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అన్ని వసతులు, డాక్టర్లు ఉన్నా ఆస్పత్రి నుంచి రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకు వెళ్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై వైద్యులు వివరణ ఇస్తూ ఆస్పత్రిలో అన్ని సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యంగా ఆర్థో కేసులను 108 సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆర్థో కేసులు ప్రభుత్వ ఆస్పత్రులకే అనుసంధానం చేస్తే తప్ప దీనికి తెరపడదని వారు తెలిపారు.
వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరుకావడమేమిటని క్యాన్సర్ విభాగ హెచ్ఓడీ ఏవై.రావుపై రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మండిపడ్డారు. క్యాన్సర్ విభాగంలో 60 మంది రోగులు మాత్రమే ఉండడమేంటని ప్రశ్నించారు. ఆస్పత్రిలోని టెలిఫోన్ బూత్ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ ముగిసినా సాయి ఫార్మసీ ప్రైవేట్ మెడికల్ షాపును ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రోగులకు అతి తక్కువ ధరలకు అందించే జీవనధార ఫార్మసీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
పశ్చిమ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఎంజీ ఎం ఆస్పత్రి అభివృద్ధికి ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. హామీలను నెరవేర్చే బాధ్యత ఎంజీఎం వైద్యులపైనే ఉందని పేర్కొన్నారు. ఇప్పటి నుంచైనా క్రమం తప్పకుండా హెచ్డీఎస్ సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఎంజీఎంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ఆరోగ్యశ్రీ, హెచ్డీఎస్ నిధులపై మూడు నెలలకోమారు ఆడి టింగ్ చేయాలని సూచించారు.
ఆస్పత్రిలో పీపీటీ భాగస్వామ్యంతో నెలకొల్పిన మెడల్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహణ తీరుపై ఎంజీఎం సిబ్బంది మండిపడ్డారు. ఔట్పేషంట్లకు ఇచ్చిన ప్రాధాన్యం ఇన్పేషంట్లకు ఇవ్వడం లేదని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని కోరారు. సమావేశంలో సూపరింటెం డెంట్ మనోహర్, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంచందర్ధరక్, ఆర్ఎంఓలు నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్, హెచ్ఓడీలు కరుణాకర్రెడ్డి, టీవీ.రావు, వి.చంద్రశేఖర్, శ్రీనివాస్, దొడ్డ రమేష్, శ్రీరాములు, ఏవై.రావు, హెచ్డీఎస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రూ.400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు
హెచ్డీఎస్ సమావేశంలో ప్రజాప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధితోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు రూ. 400 కోట్లతో యూనిటరీ ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని తీర్మానించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి ఈనెల 22న వైద్యశాఖ మంత్రి కొండ్రు మురళి, డీఎంఈతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి సారయ్య, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి, చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు.