గులాబీ జెండాను రెపరెపలాడిద్దాం | TRS party makeing to win in elections | Sakshi
Sakshi News home page

గులాబీ జెండాను రెపరెపలాడిద్దాం

Mar 9 2014 4:08 AM | Updated on Sep 2 2017 4:29 AM

మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుని, గులాబీ జెండాను రెపరెపలాడిద్దామని ఆ పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్‌సింధేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను  భారీ మెజారిటీతో గెలిపించుకుని, గులాబీ జెండాను రెపరెపలాడిద్దామని ఆ పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి,  గంప గోవర్ధన్, హన్మంత్‌సింధేలు కార్యకర్తలకు  పిలుపునిచ్చారు.  
 
 శనివారం పట్టణంలోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి స మావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై  మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని, చైర్మన్ పదవిని దక్కించుకోడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టని షబ్బీర్ అలీ నేడు సంబరాలు, యాత్రలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. 60 యేళ్లగా తెలంగాణ ప్రజలను ఉద్యమకారులను రాచి రంపాన పెట్టి, కాంగ్రెస్ ఓట్లు, సీట్ల కోసమే తెలంగాణ ఇప్పడు ఇచ్చిందని ఆరోపించారు.
 
 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్ననాడు తెలంగాణ ఇచ్చి ఉంటే,  12 వందల మంది అమరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూస్తుండేవారని అన్నా రు.  కాంగ్రెస్ నాయకులు జైత్ర యాత్రలను కాకుండా అమరుల పుణ్యయాత్రలను కొనసాగిస్తే, వారికి పుణ్యమైనా దక్కుతుందన్నారు.  ఇక ప్రతీ నియోజక వర్గం లో లక్ష ఎకరాలకు నీరు అందించడం, కేజీ నుంచి పీజీ వరకు కుల, మత భేదాలు లేకుండా  ఉచిత విద్యను అందించడం టీఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి , డీసీఐఎంఎస్ చైర్మన్ ముజిబోద్దిన్ పాల్గొన్నారు.
 
 పార్టీలో చేరికలు
 మాచారెడ్డి మండలంలోని సోమారంపేట మాజీ సర్పంచ్ రాజునాయక్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామాస్తులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే పట్టణంలోని పలు వార్డులో కార్యకర్తలు, యువకులు వందలాది సంఖ్యలో చేరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement