పరిష్కారానికి పది నిమిషాలు చాలు | tribals facing problems for drinking water with officer neglect | Sakshi
Sakshi News home page

పరిష్కారానికి పది నిమిషాలు చాలు

Feb 1 2014 6:31 AM | Updated on Sep 2 2017 3:15 AM

సమస్య చిన్నదే.. పట్టించుకుంటే పది ని మిషాల్లోనే తీరిపోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో పరిష్కారానికి నోచుకోక తండావాసుల పాలిట పెద్ద కష్టంగా మారింది.

లింగంపేట, న్యూస్‌లైన్ : సమస్య చిన్నదే.. పట్టించుకుంటే పది ని మిషాల్లోనే తీరిపోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో పరిష్కారానికి నోచుకోక తండావాసుల పాలిట పెద్ద కష్టంగా మారింది. గొంతు తడుపుకోవాలంటే పంటలకు పారించే నీటిపంపు దగ్గరికి పోవాల్సిందే. అక్కడా కరెంటు ఉంటేనే నీళ్లు దొరుకుతాయి.

తాగునీటి కోసం కరెంటు వచ్చీపోయే సమయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. పొద్దునా.. రాత్రి.. అనే తేడా లేదు. ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు బిందెలు పట్టుకుని పంటచేళ్లకు పరుగెత్తాల్సిందే. తండాకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోర్లవద్ద నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిందే. లింగంపేట మండలం మోతె గ్రామపంచాయతీ పరిధిలోని బట్టిప్పగడ్డ తండావాసులు రెండేళ్లుగా తాగునీటి కోసం తిప్పలు పడుతూనే ఉన్నారు.

 రెండేళ్లుగా
 తాగునీటి కోసం బట్టిప్పగడ్డ తండాలో వేసిన బోరుమోటార్ రెండేళ్ల కిందట కాలిపోయింది. అప్పటి  నుంచి మరమ్మతులు చేయించాలని తండావాసులు అధికారులకు, పాలకులకు చెబుతూనే ఉన్నారు. కానీ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మారుమూల తండా కావడంతో ఉన్నతాధికారులు సైతం ఈ వైపు కన్నెత్తి చూడటం లేదు. బోరు మోటారు పనిచేయక పోవడంతో మంచినీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది.

 వ్యవసాయ బావులే దిక్కు
 అధికారులు, పంచాయతీ పాలకులు కాలిన బోరుమోటారుకు మరమ్మతు లు చేయించక పోవడంతో గిరిజనులు వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్నారు. తండా సమీపంలోని పంటచేళ్లలో వేసిన బోరుబావుల వద్ద నుంచి నీ టిని తెచ్చుకుంటున్నారు. త్రీఫేజ్ కరెంట్ ఉంటేనే ఆ నీరు దొరుకుతుంది. క రెంట్ లేని సమయంలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెండేళ్లుగా తంటాలు పడుతున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని తండావాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement