
హిందూపురం వద్ద రైలు ప్రమాదం
అనంతపురం నుంచి బెంగళూరువైపు వెళుతున్న హంపీ ఎక్స్ప్రెస్ కాపలా లేని గేటువద్ద ఆగివున్న లారీని ఢీకొనడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు.
హిందూపురం (అనంతపురం జిల్లా): అనంతపురం నుంచి బెంగళూరువైపు వెళుతున్న హంపీ ఎక్స్ప్రెస్ కాపలా లేని గేటువద్ద ఆగివున్న లారీని ఢీకొనడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున 3.30 గంటలకు హిందూపురం సమీపంలోని దేవరపల్లి సమీపంలో జరిగింది. ఫలితంగా బెంగుళూరు వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. దేవరపల్లి వద్ద కాలపాలేని రైల్వే గేటు ఉంది. బెంగుళూరు నుంచి హిందూపురం పారిశ్రామిక వాడకు తుక్కు ఇనుము లోడుతో వెళుతున్న ఒక లారీ సాంకేతిక లోపంతో రైలు పట్టాలపై ఆగిపోయింది.
అదే సమయంలో అనంతపురం నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న హంపీ ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చి రైలును ఢీకొంది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ ప్రవీణ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. లారీని చాలాదూరం లాక్కెళ్లిన రైలు ఆగిపోయింది. అయితే రైలు ప్రయాణికులకెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు చీకట్లో ఏమి జరిగిందో తెలియక భయభ్రాంతులకు గురై హాహాకారాలు చేశారు.
రైలు ఆగిన వెంటనే విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు లారీ డ్రైవర్ మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసత్రికి తరలించారు. కాసేపు ఆగిన రైలు యథావిధిగా వెళ్లిపోయింది. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ప్రవీణ్కుమార్ హిందూపురం పట్టణానికి చెందినవాడు.