రేపు శివరాత్రి ఏర్పాట్లకు టెండర్లు | Tomorrow tenders for Shivaratri arrangements | Sakshi
Sakshi News home page

రేపు శివరాత్రి ఏర్పాట్లకు టెండర్లు

Jan 6 2014 2:03 AM | Updated on Sep 2 2017 2:19 AM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్ ఈఓ, డీసీ కేవీసాగర్‌బాబు తెలిపారు.

మహానంది, న్యూస్‌లైన్ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్ ఈఓ, డీసీ కేవీసాగర్‌బాబు తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 7, 18 తేదీల్లో రెండు విడతలుగా టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు. దేవస్థానం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఈ నెల 7న టెండర్లు నిర్విహ స్తామన్నారు. మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్ల టెండర్లలో పాల్గొనేవారు రూ. 25వేల డిపాజిట్ చెల్లించాలన్నారు.

చలువపందిళ్లు, షామియానాల ఏర్పాటు, సున్నపుపూత పనులు, తాగునీటి వసతి కల్పన, స్వామివారి కల్యాణవేదిక, స్వాగతతోరణం, వేదిక ముందు కూర్చునేందుకు పందిరి, క్యూలైన్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్స్, ఇతర పనులకు ఇదే రోజు టెండర్లు నిర్వహిస్తామన్నారు. నవగ్రహాల వద్ద దీపారాధనకు కావాల్సిన సామగ్రి సరఫరా, అభిషేక సామగ్రి విక్రయ కేంద్రం, పూలదుకాణం ఏర్పాటు, తలనీలాల సేకరణ, నందివిగ్రహం వద్ద ఫొటోలు తీసుకునే హక్కు తదితరవాటికి సంబంధించి ఈ నెల 18వతేదీన టెండర్లుంటాయని సాగర్‌బాబు తెలిపారు.

 స్థల పరిశీలన..
  క్షేత్రంలో ఓ కమ్యూనిటికి చెందిన అన్నసత్రం నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఈఓ ఆదివారం పరిశీలించారు. సూపరింటెండెంట్ మధు, వీఆర్‌ఓ శ్రీకాంతరావు, రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement