స్థాయి పెంచి సేవలు తగ్గించారు | To increase the level of services reduced | Sakshi
Sakshi News home page

స్థాయి పెంచి సేవలు తగ్గించారు

Dec 4 2014 2:12 AM | Updated on Sep 2 2017 5:34 PM

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి పెంచి క్లస్టర్ పరిధిలోకి తీసుకురావడంతో వైద్య సేవలు తగ్గాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

వెంకటాచలం: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి పెంచి క్లస్టర్ పరిధిలోకి తీసుకురావడంతో వైద్య సేవలు తగ్గాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా 24 గంటలూ వైద్య సేవలు అందించేదన్నారు. క్లస్టర్ పరిధిలో చేర్చడంతో ఉదయం 9 నుం చి సాయంత్రం 4 గంటల వరకే సేవలు అందిస్తున్నారన్నారు.
 
  ఎల్లవేళలా వైద్యం అందించేలా ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు అవసరమైన భవనం, సిబ్బంది, పరికరాలను కోరుతూ నివేదిక పంపుతామని కాకాణి చెప్పారు. రికార్డులు పరిశీలించి నిధులు వినియోగంపై ఆయన ఆరా తీశారు. పేదలకు సరైన వైద్యం అందలేదన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమే అయినా దాని స్థాయికి తగినట్టు వసతులు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రిలో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని కోఆప్షన్ మాజీ  సభ్యుడు షేక్ కరీంసాహెబ్ కోరారు.
 
 ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షుడు వల్లూరు శ్రీధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు అక్బర్, హుస్సేన్, ఎంపీడీఓ టి సుగుణమ్మ, తహశీల్దార్ డీవీ సుధాకర్, క్లస్టర్ డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ గీతామణి, వైఎస్సార్‌సీపీ నేతలు కసుపూరు కోదండరామిరెడ్డి, పెళ్లూరు సుధాకర్ రెడ్డి, ఆరుకుంట ప్రభాకర్‌రెడ్డి, నాటకం శ్రీనివాసులు, డబ్బుగుంట వెంకటేశ్వర్లు ,పాశం ప్రభాకర్, వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement