
పోల‘వర’మిస్తాం : మంత్రి కామినేని
పోలవరం ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మించి తీరుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తలొగ్గేది లేదన్నారు.
గుడివాడ అర్బన్ : పోలవరం ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మించి తీరుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తలొగ్గేది లేదన్నారు. అందుకే ముందుగానే ఆర్డినెన్స్ జారీ చేశామని చెప్పారు. మంగళవారంబీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన సమావేశం అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ విభజనవల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చాలా నష్టం జరిగిందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 452 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.
100రోజుల ప్రణాళికతో విద్యా, వైద్యంపై దృష్టి సారిస్తున్నామన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రీతిగా ఆరోగ్యశ్రీ కన్నా మెరుగైన సేవలను ప్రజలకందిస్తామని తెలిపారు. విజయవాడలో ఎయిమ్స్ను నిర్మిస్తామన్నారు. సిద్థార్థ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మరింతగా విస్తరింపజేస్తామన్నారు. త్వరలోనే 24గంటల కరెంట్ సరఫరా అన్ని ప్రాంతాలకు అందిస్తామన్నారు. రుణమాణఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ, మాజీ మంత్రి యేర్నేని సీతాదేవి తదితరులు పాల్గొన్నారు.