సీమ అభివృద్ధికి పోరుబాట | The development of Europe porubata | Sakshi
Sakshi News home page

సీమ అభివృద్ధికి పోరుబాట

Mar 26 2015 3:24 AM | Updated on Sep 2 2017 11:22 PM

రాయలసీమ అభివృద్ధికి తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు స్పష్టం చేశారు.

అఖిలపక్షం, ప్రజా సంఘాలు కలసి రావాలి
 
కర్నూలు(రాజ్‌విహార్): రాయలసీమ అభివృద్ధికి తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. వచ్చే నెలలో నిర్వహించనున్న ఆ పార్టీ 21వ అఖిల భారత మహాసభల సందర్భంగా బుధవారం స్థానిక సి.క్యాంప్ సెంటర్‌లోని లలిత కళాసమితిలో ‘రాయలసీమ అభివృద్ధి- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన బడ్జెట్‌లో అందుకు తగ్గట్లు నిధులు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. కేంద్రం వెనుకబడిన ప్రాంతాల పేరుతో జిల్లాకు కేంద్రం ఇచ్చిన రూ.50కోట్ల నిధులు ఏ మూలకు ఖర్చు చేసుకోవాలని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యక హోదాను తెప్పించడంలో విఫలమయ్యారన్నారు.

సీమ అభివృద్ధికి తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనలకు అఖిల పక్షం, ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలం చెందారని, పరిశ్రమలను రాజధాని చుట్టూ నిర్మించకుండా వెనుకబడిన జిల్లాల్లో నిర్మిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధిలోకి వస్తాయన్నారు. పట్టిసీమ నీటిని రాజధాని ప్రాంతాలకు తరిలించేందుకే సర్కారు కసరత్తు చేస్తోందన్నారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే, కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ.గఫూర్ మాట్లాడుతూ రాజధాని పేరుతో లాక్కునే భూముల్ని సింగపూర్ సంస్థలకు అప్పగించేందుకు ఒప్పందం జరిగిందన్నారు. 33వేల ఎకరాలు అవసరం లేదని తమ పార్టీ చెబుతున్నా పట్టించుకోవకపోవడం విచారకరమన్నారు. సదస్సులో రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, కమిటీ సభ్యులు రామకృష్ణ, కె.వి.సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement