రాజధాని నిర్మాణం వెనక బాబు కుట్ర | The capital structure of the conspiracy behind the launches | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణం వెనక బాబు కుట్ర

Jan 3 2015 3:52 AM | Updated on Sep 2 2017 7:07 PM

రాజధాని నిర్మాణం వెనక బాబు కుట్ర

రాజధాని నిర్మాణం వెనక బాబు కుట్ర

రాజధాని నిర్మాణం వెనక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

గుంటూరు సిటీ : రాజధాని నిర్మాణం వెనక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సింగపూర్ సహకారంతో రాజధాని నిర్మించే ముసుగులో అక్కడ ఉన్న తన ఆస్తులను ఇక్కడికి డంప్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పన్నిన పన్నాగమిదని ఆరోపించారు.

గుంటూరు అరండల్‌పేటలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం పోలూరి విలేకరులతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాలంలో సంపాదించిన ఆస్తులన్నీ అప్పట్లోనే సింగపూర్ తరలించారన్నారు. దీనిపై తెహల్కా డాట్ కామ్‌తో సహా పలు జాతీయ పత్రికలు కూడా వార్తా కథనాలు ప్రచురించాయనీ పేర్కొన్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని ఉపయోగించుకుని ఇప్పుడా ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు బాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారనీ, అందులో రాజధాని నిర్మాణం ఒకటనీ వివరించారు. వీటన్నింటినీ బట్టబయలు చేసేందుకు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నడుం బిగించిందన్నారు. రాజధాని భూ సేకరణ విషయంలో చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే ముందుగానే ఆయన హైకోర్టులో దీనిపై కేవియట్ ఎందుకు దాఖలు చేస్తారని వెంకటరెడ్డి ప్రశ్నించారు.

దీని వలన కేసులు ఆగుతాయనుకోవడం భ్రమేనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ తరుపున న్యాయవాదులు మొత్తం రాజధాని గ్రామాల బాధిత రైతాంగానికి బాసటగా నిలుస్తుందని స్పష్టంచేశారు. వారి కోసం కేసులు ఉచితంగా వాదించి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. దీని కోసం పది మంది సీనియర్ న్యాయవాదులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీ నేతృత్వంలో రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అమల్లో ఉన్న చట్టాలు, సీఆర్‌డీఏ బిల్లు తదితరాలపైఅవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement