ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల అవినీతిని బయటపెట్టేందుకు పటిష్టమైన జనలోక్పాల్ కావాలని ‘మన కోసం’ సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శివరామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విజయవాడ, న్యూస్లైన్: ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల అవినీతిని బయటపెట్టేందుకు పటిష్టమైన జనలోక్పాల్ కావాలని ‘మన కోసం’ సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శివరామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం 3వ రాష్ట కమిటీ సమావేశం పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులో గల ఒక హోటల్లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కోరలు లేని లోక్పాల్బిల్లు తీసుకురావటం వల్ల ప్రజలకు ఉపయోగం లేనదన్నారు.
2005లో కేంద్ర ప్రభుత్వం సహ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని తెలిపారు. నాటి నుంచి సామాజిక కార్యకర్తలు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప చట్టం అమలు కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయటం లేదని ఆరోపించారు. సహ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసేందుకు అవసరమైన సిబ్బంది, నిధులు, అధికారులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తను ఏర్పాటు చేయటం ద్వారా అవినీతిని అరికట్టవచ్చన్నారు. అన్ని రాజకీయపార్టీలను కూడా సహ చట్టం పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
పార్టీలకు వచ్చే విరాళాల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కేజ్రీవాల్ స్ఫూర్తితో మనకోసం సంస్థ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. అనంతరం సంఘం నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్, ప్రధాన కార్యదర్శి జాస్తి తాతారావు, ఉపాధ్యక్షుడు జి.నాగరత్నం నాయుడు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నూతన కమిటీ వివరాలు
రాష్ట్ర అధయక్షుడిగా కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జి.మురళి, కోశాధికారిగా కె.రాజారావు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఏడుగురు సంయుక్త కార్యదర్శులు, ఐదుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఐదుగురు ప్రచార కార్యదర్శులు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉన్నారు.