పెళ్లింట్లో విషాదం | tears of sad after wedding cermony | Sakshi
Sakshi News home page

పెళ్లింట్లో విషాదం

May 1 2015 11:42 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఓ పెళ్లి ఇంట్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

హైదరాబాద్: ఓ పెళ్లి ఇంట్లో  రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.  పెళ్లి ముగించుకుని గుంటూరు నుంచి నగరానికి గురువారం అర్ధరాత్రి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, మరో మహిళ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెలితే .... కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, అరుణకుమారి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్దకుమారుడు వినయ్ చైతన్య వివాహం గురువారం స్వస్థలం గుంటూరు జిల్లాలో నిర్వహించారు. వివాహ వేడుకలు అన్ని పూర్తిచేసుకుని అర్ధరాత్రి గుంటూరు నుండి నగరానికి బయలుదేరారు. వివాహానికి కొనుగోలు చేసిన కారులో అరుణ కుమారి, సత్యనారాయణ లతో పాటు అరుణ కుమారి తండ్రి పిన్నమనేని కామేశ్వరరావు (74), అతని భార్య అన్నపూర్ణమ్మ(68), అరుణ కుమారి చిన్న కొడుకు సందీప్ కారు నడుపుతూ కూకట్‌పల్లిలోని నివాసానికి వస్తున్నారు.

 

పెళ్లి పనులు, రాత్రి డ్రై వింగ్ కావడంతో కారు నడుపుతున్న సందీప్ అప్పటికే పూర్తిగా అలసిపోయాడు. తెల్లవారు జామున సుమారు 4 గంటల సమయంలో కొద్దిదూరంలో ఇంటికి చేరతాం అనే సమయంలో ఎర్రమంజిల్ రోడ్డు లోని మెట్రో పిల్లర్‌కు వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు లోనుండి కామేశ్వరరావు బయటపడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని పక్కనే కూర్చున్న అన్నపూర్ణమ్మ కూడా తీవ్ర గాయాలపాలైంది. కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో అరుణకుమారి, సత్యనారాయణ, సందీప్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement