టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుల కోసం టెండర్లు పిలిచిన ప్రతిసారీ కొంద రికి జీవనోపాధి పోతోంది. టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు...
- విష్ణు నివాసంలో కార్మికుల బతుకు భయం
- టెండర్ దక్కించుకునే ఎత్తుగడల్లో
- తొలగించే ప్రయత్నాలు
సాక్షి, తిరుపతి: టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుల కోసం టెండర్లు పిలిచిన ప్రతిసారీ కొంద రికి జీవనోపాధి పోతోంది. టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు వేస్తున్న ఎత్తుగడలు కార్మికుల పాలిట శాపంగా మారుతున్నాయి. టీటీడీ నిర్వహణలోని విష్ణునివాసం వసతి సముదాయంలో పనిచేస్తున్న కార్మికుల కాంట్రాక్టును ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త కంపెనీ చేపట్టనుంది.
ఈ కంపెనీ యాజమాన్యం ప్రస్తు తం పనిచేస్తున్న కార్మికుల్లో సగానికి పైగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విష్ణునివాసంలో 287 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్టును గతంలో ఆల్ సర్వీసెస్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పుడు కాంట్రాక్టు కాలపరిమితి ముగియడంతో కొత్తగా టెండర్లు ఆహ్వానించారు.
ఆ మేరకు బీవీజీ అనే కంపెనీ గతం కంటె ఏడు లక్షల రూపాయల తక్కువకు కోట్ చేసి నెలకు రూ.17,90,000లకు చేజిక్కించుకుంది. కార్మికుల జీతాలతో పాటు, మెటీ రియల్ కూడా ఈ కంపెనీయే కొనుగోలు చేయాలి. టెండర్ దక్కించుకునేందుకు గతం కంటె తక్కువకు కోట్ చేసినప్పటికీ నిబంధనల ప్రకారం పనులు చేయడం సాధ్యం కాదని తెలిసింది. దీంతో ఆ కంపెనీ కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
గతంలోనూ..
గతంలో ఇదేవిధంగా కొన్ని సంస్థలు ఉద్యోగాల పేరుతో కార్మికులను మోసం చేశాయి. తమ సంస్థ ద్వారా టీటీడీలో కాంట్రాక్టు కార్మికులుగా చేరితే భవిష్యత్తులో ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు నిరుద్యోగులను మభ్యపెట్టాయి. కాంట్రాక్టు కార్మికులుగా ఉద్యోగంలో చేరేందుకు పలువురు వేలకువేలు సమర్పించుకున్నారు.
కార్మికుల భద్రత టీటీడీకి పట్టదా?
కార్మికులకు సంబంధించి కాంట్రాక్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్న టీటీడీ కార్మికుల ఉద్యోగ భద్రతపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. టీటీడీ తరఫున లేబర్ ఆఫీసర్ లేకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. టెండర్లు పిలిచిన ప్రతిసారీ కాంట్రాక్ట్ కార్మికుల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఇప్పుడు విష్ణునివాసంలో పనిచేస్తున్న కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తుండడంతో కొన్ని కార్మిక సంఘాలు ఆందోళన దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై శుక్రవారం ఉదయం 10 గంటలకు కొరటా సత్యనారాయణ మెమోరియల్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
కార్మికశాఖ కమిషనర్కు ఫిర్యాదు
విష్ణునివాసంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై గురువారం కార్మికశాఖ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. వంద మందిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కార్మిక ప్రతినిధులు ఎ.రజినీకుమార్, ఎం.చిట్టిబాబు ఆరోపించారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులందరినీ కొత్త కాంట్రాక్టు సంస్థ కూడా కొనసాగించాలని వారు కోరారు.