నా ఓటమికి దేశం నేతల కుట్ర | TDP MLA Pitani Satyanarayana fire on tep leaders | Sakshi
Sakshi News home page

నా ఓటమికి దేశం నేతల కుట్ర

Apr 24 2015 4:16 AM | Updated on Aug 10 2018 8:13 PM

గత ఎన్నికల్లో తన ఓటమికి తెలుగుదేశం పార్టీ నేతలే కృషి చేశారని ఆ పార్టీకి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు.

వల్లూరు (ఆచంట) :గత ఎన్నికల్లో తన ఓటమికి తెలుగుదేశం పార్టీ నేతలే కృషి చేశారని ఆ పార్టీకి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. పార్టీలో ఉంటూ నమ్మక ద్రోహం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.11 కోట్లతో నిర్మించనున్న వ ల్లూరు-ఇలపకుర్రు, రూ.12 కోట్లతో నిర్మించనున్న కొడమంచిలి-సిద్ధాంతం ఆర్ అండ్‌బీ రహదారి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వల్లూరు, ఆచంటలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తన ఓటమికి కృషి చేసిన నమ్మక ద్రోహులు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి ఓటమికి ప్రయత్నిస్తే బాధపడేవాడినే కాదన్నారు. రూ.18 కోట్లతో చేపట్టిన మార్టేరు-కోడేరు ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణ పనులకు ఆటంకాలు కలిగిస్తున్న వారు భ విష్యత్‌లో బాధ పడతారని ఎమ్మెల్యే పితాని అన్నారు. ఆరునూరైనా మార్టేరు-కోడేరు ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణ పనులను పూర్తి చేసి తీరతానని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.
 
 కోడేరు-గన్నవరం మధ్య వారధి నిర్మాణానికి కృషి
 ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై కోడేరు నుంచి  గన్నవరం వరకూ వారధి నిర్మించడానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యేల చెప్పారు. ప్రస్తుతం అయోధ్యలంక- పుచ్చల్లంకలను కలిపే వారధి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ఆలస్యమైనా కోడేరు-గన్నవరం వంతెన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 
 కోనపోతుగుంట పేరు మార్చండి
 ఆచంట పంచాయతీ పరిధి కోనపోతుగుంటలో రూ.18 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే పితాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనపోతుగుంట పేరును మార్చాలని ఎమ్మెల్యే పితాని గ్రామస్తులకు సూచించారు. అందరికీ అమోదయోగ్యమైన పేరును సూచించాలని ఆయన కోరారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పితానిని గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మేకా పద్మకుమారి, జెడ్పీటీసీ బండి రామారావు, ఆర్‌అండ్‌బీ ఈఈ విజయరత్నం, డిఈ ఎ శ్రీనివాస్, ఏఈ టి.ప్రసాద్, ఇన్‌చార్జి తహసిల్దారు ఆర్‌వీ కృష్ణారావు, ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావు, వల్లూరు, ఆచంట, కందరవల్లి, పెదమల్లం, క రుగోరుమిల్లి  సర్పంచ్‌లు బండి హైమావతి, గుండుబోయిన సతీష్, కె వీరాస్వామి, ముత్తాబత్తుల రామచంద్రుడు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గెద్దాడ సన్యాసిరావు, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు కండిబోయిన సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు కేతా మీరయ్య, మాజీ  అధ్యక్షుడు మేకా జానకిరామయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడిద శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement