
అక్రమంగా ఇసుక తవ్వకాలు.. ప్రశ్నిస్తే దాడులు..
సన్నకారు రైతులకు చెందిన కొద్దిపాటి భూమిలో ఇసుక దందా నిర్వహిస్తూ అధికార పార్టీకి చెందిన కొందరు ....
► ఇదీ అధికార పార్టీ నేతల తీరు
► పోతవరంలో మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలు
► తన పొలంలో ఇసుక తవ్వొద్దన్నందుకు దాడి
చిలకలూరిపేట రూరల్ : సన్నకారు రైతులకు చెందిన కొద్దిపాటి భూమిలో ఇసుక దందా నిర్వహిస్తూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నిస్సిగ్గుగా.. మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శికిచెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సయ్యద్ సైదాకు మండలంలోని పోతవరంలో సర్వే నెంబర్ 551, 76 సర్వే నెంబర్లలో ఎకరం పొలం ఉంది. అక్కడ కొంతకాలం నుంచి అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక తవ్వుకుంటున్నారు. తవ్వకాలు చేపడితే పొలంలో గుంటలు ఏర్పడతాయని సైదా పలుసార్లు వారికి తెలియజేశాడు. అయినా.. ప్రయోజనం లేకపోయింది.
మూకుమ్మడి దాడి..
రాత్రిళ్లు పొక్లెయిన్ ఏర్పాటు చేసి తవ్వుకుని పగటి పూట కూలీల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. బుధవారం సమాచారం తెలుసుకున్న సైదా అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఇసుక తవ్వకాలు చేపడుతుండటం చూసి పనులను అడ్డుకున్నాడు. కోపోద్రిక్తులైన టీడీపీకి చెందిన లింగంగుంట్ల షేక్ అల్లాబుడే, యలమంద మహ్మద్ అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బంధువులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాలని సూచించారు.