మంత్రి రాజప్పకు సొంతపార్టీ కౌన్సిలర్‌ ఝలక్‌

TDP Counselor Joining YSRCP - Sakshi

వైఎస్సార్‌ సీపీలో చేరిన అమీనాబీబీ

కో–ఆర్డినేటర్‌ దవులూరి సమక్షంలో 200 మంది పార్టీలో చేరిక

పెద్దాపురం: అధికార పార్టీలో అభివృద్ధే తమదేనంటూ ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ఆ పార్టీ కౌన్సిలర్‌ సయ్యద్‌ అమీనా బీబీ ఝలక్‌ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కో–ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు సమక్షంలో శుక్రవారం కౌన్సిలర్‌ అమీనాబీబీ, ఆమె భర్త సయ్యద్‌ కరీమ్‌ (జానీ)తో పాటు సుమారు 200 మంది ముస్లింలు, వార్డులోని టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కో–ఆర్డినేటర్‌ దొరబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించడం తథ్యమన్నారు. 

పార్టీలో చేరిన అమీనాబీబీ, జానీ మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అశ్లీల నృత్యాలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడు చేసిన వ్యక్తిని మంత్రి రాజప్ప నెత్తిన పెట్టుకున్నారన్నారు. కౌన్సిలర్‌ భర్తపై పోలీసులు చేయిచేసుకుంటే కనీసం కౌన్సిలర్‌ కోరిన విధంగా క్షమాపణ కూడా చెప్పించలేని పరిస్థితి ప్రస్తుత పాలకులదన్నారు. ప్రజా పాలనను గాలికి  వదిలి  అక్రమ మట్టి తవ్వకాలతో సొమ్ములు చేసుకుంటున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ఎన్నారై దొరబాబు మున్సిపాల్టీకి అందించిన మంచినీటి ట్యాంకర్లు, సేవా కార్యక్రమాలతో ఆకర్షితులం కావడమే కాకుండా జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందనే నమ్మకంతో పార్టీలో చేరామన్నారు.

 జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం, దవులూరి దొరబాబును ఎమ్మెల్యేగా గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామన్నారు. సుమారు 200 మంది ముస్లింలు, మహిళలు, వార్డు కార్యకర్తలకు దొరబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సామర్లకోట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి దొరబాబు,  దవులూరి సుబ్బారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, కరణం భాను, ఎలిశెట్టి నరేష్, గోకేడ రాజా, ముస్లిం కమిటీ పెద్దలు సర్దార్, పబ్బీర్, నూరీ, బషీర్, జిలాల్, చందు, సందీప్, జాపూర్, ఇస్మాయేలు, రబ్బాని, సంధాని తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top