జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శతశాతం ఎలక్ట్రికల్ సర్వే చేయాలని డీపీఓ బలిబాడ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల ఈఓపీఆర్డీలతో సమావేశం
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శతశాతం ఎలక్ట్రికల్ సర్వే చేయాలని డీపీఓ బలిబాడ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లాలోని అన్ని మండలాల ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోనూ ఎన్ని విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లు ఉన్నాయో సర్వే చేపట్టాలన్నారు. ఎన్నింటికి డబ్బులు చెల్లించారు..? అధనంగా ఎన్నింటికి చెల్లించి ఉన్నారన్న విషయాలను సర్వే చేసి అప్లోడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీ సమాచారాన్ని ఎంత మేరకు సేకరించారన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వెనుకబడి ఉన్న మెంటాడ, ఇతర మండలాధికారులను మందలించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై వారికి అవగాహన కల్పించారు. తాగునీటి పథకాలు విద్యుత్ లేని కారణంగా ఆగిపోరాదన్నారు. అలా జరిగితే సంబంధిత సర్పంచ్లు, కార్యదర్శులే బాధ్యులన్నారు. ఇంటి పన్నుల వసూళ్లను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో విజయనగరం డీఎల్పీఓ మోహనరావు, ఈఓపీఆర్ఆర్డీల సంఘం అధ్యక్షుడు ఐ.సురేష్, పర్యవేక్షకుడు కేఆర్ఎం పంతులు తదితరులు పాల్గొన్నారు.