సుదర్శన్‌గౌడ్‌కు ఏఎస్పీగా పదోన్నతి | sudharshan goud appointed as ASP | Sakshi
Sakshi News home page

సుదర్శన్‌గౌడ్‌కు ఏఎస్పీగా పదోన్నతి

Feb 28 2014 3:59 AM | Updated on Sep 2 2017 4:10 AM

కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్‌ను ఖమ్మం అడిషన ల్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వు లు జారీచేసింది.

కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్‌ను ఖమ్మం అడిషన ల్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వు లు జారీచేసింది. సుదర్శన్‌గౌడ్ జిల్లాలో అంతముందు ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. 2012లో ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాక అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. అత్యధిక కేసులతో కరీంనగర్ రేంజ్ ను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపారు.
 
 పలు సంచలన కేసులు ఈయన హయాంలోనే నమోదయ్యాయి. లంచాలు తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారులను పట్టుకుని సిండికేట్ల వ్యవహారాన్ని బయటకు తీశారు. జిల్లాలో పాతుకుపోయిన పలువురు అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుపాలు చేశారు. అన్ని శాఖల అధికారులపై దాడుల చేసి సుమారు 58 కేసులు నమోదు చేశారు. 78 మందిని అరెస్టు చేశారు. అవినీతి అధికారులు ఎంతటి వారైనా సుదర్శన్‌గౌడ్ వదలిపెట్టలేదు. ఏసీబీని గ్రామీణులు, నిరక్షరాస్యుల వరకూ ఆయన తీసుకెళ్లారు. సుమారు 15 కేసుల్లో నిరక్షరాస్యులు ఇచ్చిన సమాచారంతోనే అవినీతిపరులను కటకటాల్లోకి నెట్టారు. యువత ముందుకు వస్తే మరింత సమర్థంగా అవినీతిని రూపుమాపేవారమని సుదర్శన్‌గౌడ్ పేర్కొనేవారు.
 
 సుమారు 26 నెలలు కరీంనగర్ రేంజ్‌లో పనిచేసిన  ఆయన పలు కేసులను పరిశోధించారు. టీ బాయ్‌గా, రైతుగా, దుకాణదారుడిగా మారువేశాల్లో వెళ్లి అవి నీతిపరులను పట్టుకున్నారు. తాజాగా కరీంనగర్ రాంనగర్‌లోని బాలుర వసతిగృహంలో అవినీతిపై విచారణ చేపట్టారు. హాస్టల్ వార్డెన్‌పై వేటుపడింది. మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న సమయంలో పదోన్నతిపై ఖమ్మం అడిషనల్ ఎస్పీగా వెళ్తున్నారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement