ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
అందుబాటులో 50,879 టికెట్లు, లక్కీడిప్ ద్వారా 6,744
టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా 2018, జనవరికి సంబంధించి మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈవోలో మాట్లాడారు. విడుదల చేసిన వాటిలో 6,744 టికెట్లు లక్కీడిప్ విధానంలో కేటాయించామన్నారు. వీటిలో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 ఉన్నాయన్నారు.
భక్తులు వారంపాటు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని, తర్వాత కంప్యూటర్ లక్కీడిప్ విధానంలో టికెట్లు కేటాయిస్తామన్నారు. టికెట్ పొందినవారు 3 రోజుల్లో నగదు చెల్లించాలని, చెల్లించని టికెట్లను మరోసారి లక్కీడిప్లో ఇతర భక్తులకు కేటాయిస్తామన్నారు. మిగిలిన 44,135 సేవా టికెట్లను పాత పద్ధతిలోనే ఆన్లైన్లో విక్రయిస్తారు. కల్యాణోత్సవం 10,125, ఊంజల్సేవ 2,700, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకార సేవ 12,825, విశేష పూజ 1,500 టికెట్లు ఉన్నాయి.
వాహన సేవల సమయం మార్పు సమీక్షిస్తున్నాం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో గరుడవాహన సేవ తరహా లోనే రాత్రి వేళల్లో నిర్వహించే మిగిలిన వాహన సేవల సమయం మార్పు అంశాన్ని సమీక్షిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. వివాదాల్లేకుండా ఆగమ పండితుల సూచనల ప్రకారమే చేస్తామన్నారు. డిసెంబర్ 29వ తేదీ వైకుంఠ ఏకాదశితోపాటు వచ్చే బ్రహ్మోత్సవాలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలలో ఉద్యానవనాల సుందరీకరణ కోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు.