నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల వ్యవహారంలో తిర‘కాసు’ చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ముడుపులు దండుకునేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అనంతపురం కార్పొరేషన్, న్యూస్లైన్: నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల వ్యవహారంలో తిర‘కాసు’ చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ముడుపులు దండుకునేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పదోన్నతుల కల్పించాలని సిబ్బంది కోరుతున్నా అధికారులు పట్టించుకోకుండా ఏడాదికిపైగా పెండింగ్ ఉంచారు. ఇప్పుడు సమ్మె సమయంలో ఫైల్ సిద్ధం చేయడం వెనుక పెద్ద కథ నడిచిందంటున్నారు. పరిపాలన విభాగంలో ఈ ఫైలును చూడాల్సిన సీ-1 క్లర్క్ కూడా సమ్మెల్లో ఉన్నప్పటికీ, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ద్వారా ఫైలు సిద్ధం చేయించినట్లు తెలిసింది. పదోన్నతులు కల్పించేందకు రంగం సిద్ధం చేశాము.
ఇందుకు ముడుపులు ముట్టజెప్పాలని తన సన్నిహితుల ద్వారా అర్హులైన వారికి సమాచారం అందించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితేబ జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఏడాది నుంచి ఏదో ఒక వంక చెబుతూ దీనిని పెండింగ్లో ఉంచారు. దీనికితోడు ఆరు నెలల కిందట ఇవ్వాల్సిన చార్జ్మెమోలను తొక్కి పెట్టి పదోన్నతులు కల్పించే సమయంలో దానికి బయటికి తీసుకొచ్చారు. దీంతో మరోమారు పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో సిబ్బంది సమ్మెలోకి వెళ్లిన సిబ్బంది పదోన్నతులపై ఆశలు వదులుకున్నారు. అయితే ఉన్నఫళంగా అధికారులు పదోన్నతుల కల్పించేందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించారు. సమ్మె సమయంలో పదోన్నతులు కల్పించేందుకు అధికారులు సిద్ధపడడాన్ని ఉద్యోగవర్గాలే తప్పుపడుతున్నాయి. ఓ అధికారి బాధ్యతలు ఈ నెలతో ముగుస్తుండడంతో, ఈలోగా పదోన్నతులు కల్పించి తన వరకు సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారానికి తెరతీసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి.