గుప్తనిధుల ముఠా అరెస్టు | secret treasure gang arrest | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల ముఠా అరెస్టు

Jan 1 2014 11:58 PM | Updated on Aug 20 2018 4:27 PM

గుప్తనిధుల ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.

 డోన్‌టౌన్, న్యూస్‌లైన్: గుప్తనిధుల ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. డోన్ మండలం వి. బొంతిరాళ్ల గ్రామంలో పోతురాజుగుట్ట వద్ద గత డిసెంబర్ 26వ తేదీన గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు అన్నాచెల్లెళ్లు నాగరాజు, రమాదేవి మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి మృతులతో పాటు జేసీబీ డ్రైవర్ రవికుమార్, డోన్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్, కొలిమిగుండ్లకు చెందిన దూదేకుల వుసేన్, హైదరాబాద్‌కు చెందిన సుభాష్‌రెడ్డి, నాగేష్‌రెడ్డి, రాధాకిషన్, ఆపరేటర్ స్నేహితుడు సుంకన్నలతో పాటు ప్రధాన సూత్రధారులైన కోయిలకొండరాజు, విజయుడు, లక్ష్మిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 వీరిలో ప్రధాన సూత్రధారులు మినహా మిగిలిన ఏడుగురిని పట్టణ సమీపంలోని తిరుమల డాబా వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ.. కోయిలకొండ రాజు, ఈడిగె ఆంజనేయులు, లక్ష్మిరెడ్డిలు గుప్త నిధులకోసం వేటాడేవారన్నారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్‌కు చెందిన రాధాకిషన్, సుభాష్‌రెడ్డి తదితరులతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కాగా నిధుల తవ్వకాల్లో ప్రధాన నిందితుడైన కోయిలకొండ రాజుకు ప్రముఖుల అండ ఉన్నట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులు హైదరాబాద్‌లోని శాతారాం, యాకత్‌పుర, మహబూబ్‌నగర్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాలలో గుప్త నిధులు కోసం తవ్వకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏయే ప్రాంతంలో తవ్వకాలు జరిపారో పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement