మూడు నెలలుగా మూత‘బడి’! | school closed due to shortage of students | Sakshi
Sakshi News home page

మూడు నెలలుగా మూత‘బడి’!

Feb 6 2014 3:24 AM | Updated on Sep 15 2018 5:45 PM

నిజానికి ఆ పాఠశాలలో 15మందికి పైగానే విద్యార్థులున్నారు. అంతా చిన్నపిల్లలే. వీరంతా పక్కగ్రామానికి వెళ్లి చదువుకోలేని వాళ్లు.

 పూడూరు, న్యూస్‌లైన్ :  నిజానికి ఆ పాఠశాలలో 15మందికి పైగానే విద్యార్థులున్నారు. అంతా చిన్నపిల్లలే. వీరంతా పక్కగ్రామానికి వెళ్లి చదువుకోలేని వాళ్లు. అయితే కేవలం ఆరుగురే పిల్లలు వస్తున్నారని తప్పుడు సమాచారమిచ్చి పాఠశాలను మూయించారు. దీంతో ఈ పిల్లల్లో చాలా మంది బడి మానేయగా.. ఇద్దరుముగ్గురు పక్క గ్రామానికి వెళ్తున్నారు. పూడూరు మండలంలోని నిజాంపేట, మేడిపల్లి గ్రామాలు కలిపి ఒకే పంచాయతీలో ఉంటాయి.

 నిజాంపేటలో ప్రాథమిక పాఠశాల ఉండగా, మేడిపల్లిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. నిజాంపేట - మేడిపల్లిల మధ్య దూరం కిలోమీటరు. మూడు నెలల క్రితం నిజాంపేట ప్రాథమిక పాఠశాలను అధికారులు ఎత్తివేశారు. నిజానికి పది మంది కంటే తక్కువ పిల్లలుంటే నిబంధనల ప్రకారం.. పాఠశాలను రద్దు చేస్తారు. కానీ ఇక్కడ 15 మంది చిన్నారులు ఉన్నా కేవలం ఆరుగురే ఉన్నారని నివేదిక పంపడంతో పాఠశాల రద్దయింది.

 మూడు నెలలుగా విద్యార్థులు బడిలేక ఇళ్ల వద్దే ఆడుకుంటున్నారు. కేవలం ఇద్దరు ముగ్గురే మేడిపల్లికి వెళ్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు దూరం నుంచి విధులకు హాజరయ్యేదని, అది కష్టంగా భావించి సదరు టీచర్ తక్కువమంది విద్యార్థులున్నారని చూపి పాఠశాల మూపించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement