సమైక్యాంధ్ర పరిరక్షణోద్య మం వరుసగా 136వరోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉధృతంగా ఎగసింది.
సమైక్యాంధ్ర పరిరక్షణోద్య మం వరుసగా 136వరోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉధృతంగా ఎగసింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమైక్యవాదులు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆదేశాలను ధిక్కరిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులను బెదిరిం చే ధోరణిలో ఆయన వైఖరి ఉందని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా కైకలూరు పోలీస్స్టేషన్లో సమైక్యవాదులు ఫిర్యాదు చేశారు. ఒంగోలులో విద్యార్థులు ‘డిగ్గీ గోబ్యాక్ ఏపీ’ అంటూ అక్షరమాలగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి, అనంతపురం జిల్లా కదిరిలో దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బిల్లు కాపీలను ఉపాధ్యాయులు దహనం చేశారు. ‘దిగ్విజయ్సింగ్ గో బ్యాక్’ అంటూ ఫైర్స్టేషన్ సెంటర్లో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు.
అశోక్బాబు తీరు అనుమానాస్పదం: నెల్లూరు ఎన్జీవోల సంఘం
రాష్ట్ర విభజన కీలకదశకు చేరుకున్న సమయంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్బాబు, చంద్రశేఖరరెడ్డి ఎన్జీఓల ఎన్నికల ప్రచారానికి పరిమితం కావడం సరికాదని ఆ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చొప్పా రవీంద్రబాబు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వారిద్దరూ నీరుగార్చుతున్నారని, ఎవరికైనా తాకట్టుపెట్టారేమోనన్న సందేహం కలుగుతోందన్నారు.
జంతర్మంతర్ వద్ద 25 నుంచి దీక్షలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ ఈనెల 25వ తేదీ నుంచి సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ (న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు కమిటీ కన్వీనర్ బాలకోటేశ్వరరావు తెలిపారు.