అధికారంకోసం నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నేడు తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు ఆత్మగౌరవ యాత్రకు సిద్ధమయ్యారని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: అధికారంకోసం నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నేడు తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు ఆత్మగౌరవ యాత్రకు సిద్ధమయ్యారని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికిచ్చిన విభజన లేఖను ఉపసంహరించుకోవడంతోపాటు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలంటూ లేఖ పంపాకే యాత్ర చేపట్టాలని సూచించారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకొచ్చి సమ్మె చేస్తుంటే చంద్రబాబు మాత్రం వారిని మరోసారి మోసగించేందుకు యాత్రకు సిద్ధమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు తన యాత్రకు ఆత్మగౌరవ వెన్నుపోటు యాత్రని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. గాదె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సెప్టెంబర్ 3న అసెంబ్లీ ఆవరణలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపారు.